Yes Bank: త్వరలో డిపాజిటర్లకు ఊరట, 70% శాతం వాటాతో 4 బ్యాంకుల చేయూత
తీవ్ర ఆర్థిక సంక్షోబంలో ఉన్న యస్ బ్యాంకును ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపడుతున్నాయి. మారటోరియం అనంతరం ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక రూపొందించింది. దీనికి కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మారటోరియం ఎత్తివేస్తారు. కొన్ని బ్యాంకులు యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనున్నాయి.
యస్ బ్యాంకు సంక్షోభం, మరిన్ని కథనాలు..
4 ప్రయివేటు బ్యాంకుల భారీ పెట్టుబడి
యస్ బ్యాంకును గాడిన పెట్టేందుకు ఎస్బీఐతో కలిసి నాలుగు ప్రయివేటు బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు.. ఒక్కో బ్యాంకు రూ.1,000 కోట్ల చొప్పున రూ.2,000 యస్ బ్యాంకు ఈక్విటీలో వాటాను తీసుకుంటున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు మరో రూ.1,100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి. దీంతో బ్యాంకు అధీకృత ఈక్విటీ మూలధనం రూ.6,200 కోట్లకు పెరుగుతుంది.
ఏ బ్యాంకుకు ఎంత వాటా?
బ్యాంకు అధీకృత మూలధనాన్ని రూ.1,100 కోట్ల నుండి రూ.6,200 కోట్లకు పెంచినట్లు నిర్మల చెప్పారు. అదనపు టైర్ 1 బాండ్స్ రైటాఫ్ వ్యవహారంలో కోర్టు పరిధిలో ఉందన్నారు. ఎస్బీఐ రూ.7,250 కోట్ల పెట్టుబడి, 49% వాటా, హెచ్డీఎఫ్సీ రూ.1,000 కోట్లు 6-7% వాటా, ఐసీఐసీఐ బ్యాంకు రూ.1,000 కోట్లు 6-7% వాటా, యాక్సిస్ బ్యాంకు రూ.600 కోట్లు 4% వాటా, కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.500 కోట్లు 3-4% వాటా. మొత్తం రూ.10,380 కోట్లు 68-71 శాతం వాటా ఈ బ్యాంకులది ఉండే అవకాశముంది.
డీమార్ట్ అధినేత, ఝున్ఝున్వాలా కూడా..
యస్ బ్యాంకులో డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ ధమానీ, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా, అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్లు ఒక్కొక్కరు రూ.500 కోట్ల చొప్పున బ్యాంకు ఈక్విటీలో వాటా తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇందుకోసం ఆర్బీఐ ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థలు, వ్యక్తులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. LIC సైతం యస్ బ్యాంకు ఈక్విటీలో వాటా తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి.
లాకిన్ పీరియడ్
యస్ బ్యాంకు ఈక్విటీలో కొత్తగా పెట్టుబడి పెట్టే బ్యాంకులు, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 75% మూడేళ్ల వరకు విక్రయించేందుకు వీల్లేదని సీతారామన్ చెప్పారు. ఎస్బీఐ తీసుకునే 49% ఈక్విటీలోనూ 26% మూడేళ్ల వరకు అలాగే ఉంటుందని చెప్పారు.
డిపాజిటర్ల నుండి ఒత్తిడి ఎదురైతే..
యస్ బ్యాంకును గట్టెక్కించేందుకు మొత్తం రూ.50,000 కోట్లు రానున్నాయి. ఇందులో రూ.20,000 కోట్లు ఈక్విటీ నిధులు. రూ.30,000 కోట్లను బల్క్ డిపాజిట్ల కింద ఇతర బ్యాంకులు సమకూరుస్తాయి. మారటోరియం తొలగించాక డిపాజిటర్ల ఒత్తిడి ఎదురైతే ఎదుర్కొనేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.