మహీంద్రా అండ్ మహీంద్రా బంపర్ ఆఫర్, ఇప్పుడు వెహికిల్ కొంటే వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ..
మహీంద్రా అండ్ మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు వెహికిల్ కొనుగోలు చేస్తే.. వచ్చే ఏడాది అంటే 2021 నుంచి ఈఎంఐ కట్టే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ ఆఫర్.. పోలీసులు, వైద్యులు, మహిళలకు మాత్రమే వర్తిస్తుందని షరతు విధించింది. కరోనా వైరస్ సందర్భంగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, అహోరాత్రులు శ్రమిస్తోన్న పోలీసులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ ఆఫర్ ప్రకటించింది.
వీరికే ఆఫర్
తమ వాహనాల అమ్మకాలను పెంచుకోవడంతోపాటు.. పోలీసులు, వైద్యులకు ప్రయోజనం కలిగించేందుకు కొత్త ఫైనాన్స్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వైద్యులు, పోలీసులు, మహిళలకు వాహనం ధరపై 100 శాతం ఫైనాన్స్ ఇస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాదు 3 నెలల మారటోరియం కూడా వర్తిస్తుందని తెలిపింది. వాహనం కోసం తీసుకున్న లోన్ ఎనిమిదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ స్కీముతో సులువుగా వాహనం కొనుగోలు చేయొచ్చని మహీంద్రా కంపెనీ తెలిపింది.
ప్రాసెసింగ్ ఫీజులో కూడా
వాహనం కొనుగోలు చేసే సమయంలో వైద్యులు, పోలీసులు, మహిళలకు ప్రాసెసింగ్ ఫీజులో కూడా సగం రాయితీ ఉంటుందని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ నక్రా తెలిపారు. వాహనం కొనుగోలు చేసిన 3 నెలల తర్వాత నగదు కట్టొచ్చు. అలాగే ఫైనాన్సింగ్ కాస్ట్ పది బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారు. బీఎస్-6 స్టాండర్డ్స్ కలిగిన పికప్ ట్రక్, ఎస్యూవీ కొనుగోలు చేసిన వారు వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ కట్టేందుకు అవకాశం ఇస్తారు. వాహనం కోసం తీసుకున్న లోన్ మొత్తంలో ప్రతీ లక్ష రూపాయలకు నెలకు రూ.1234 చొప్పున ఈఎంఐ కడితే సరిపోతుందని విజయ్ నక్రా తెలిపారు.
బంపర్ ఆఫర్
లాక్ డౌన్ వల్ల వాహనాల విక్రయాలపై ప్రభావం చూపడంతో మహీంద్ర కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ కంపెనీ వాహనాలు విక్రయాలను పెంచుకోవడానికి ఆఫర్ ప్రకటించింది. లాక్ డౌన్లో క్రమంగా సడలింపులు ఇవ్వడంతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి మహీంద్ర కంపెనీది బంపర్ ఆఫర్ అని చెప్పాల్సి ఉంటుంది.