మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు వ్యాపార, పారిశ్రామిక రంగంలోని పలువురికి వచ్చాయి. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్, రజనీ బెక్టార్, జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్, పీ సుబ్రమణియన్, శ్రీధర్ వెంబు ఇందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం పద్మ అవార్డులు ప్రకటించింది.
సస్య రక్షణ రాజుగా పేరుపొందిన ష్రాఫ్ యూపీఎల్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. 1969లో రెడ్ పాస్పరస్ తయారీని చేపట్టి, రైతుల్ని ఆదుకుంటున్నారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం ష్రాఫ్ 1.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత కుబేరుల్లో 93వ స్థానంలో ఉన్నారు. ష్రాఫ్ను పద్మభూషణ్ వరించింది.
మిసెస్ బెక్టార్స్ ఫుడ్ కంపెనీ అధినేత రజనీ బెక్టార్. రూ.20,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభించి ఐస్క్రీమ్ వ్యాపారాన్ని నేడు రూ.వెయ్యి కోట్లస్థాయికి విస్తరించారు. ఇటీవలే ఇది ఐపీవోకు వచ్చింది. రజనీని పద్మశ్రీ వరించింది.
అప్పడాల తయారీ సంస్థ లిజ్జత్ను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల్లో జస్వంతీ బెన్ జమ్నాదాస్ పోపట్ ఒకరు. రూ.80 అప్పు తీసుకొని 1950లో ప్రారంభమైన లిజ్జత్ ప్రస్తుతం రూ.800 కోట్లకు పైగా వ్యాపారం ఉంది. జస్వంతీని పద్మశ్రీ వరించింది.
గేర్ మ్యాన్ ఆఫ్ కోయంబత్తూర్గా పీ సుబ్రమణియన్కు పేరు ఉంది. శాంతి సోషల్ సర్వీస్ సంస్థ ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరణానంతరం పద్మశ్రీ పురస్కారం లభించింది.
క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్టువేర్ సేవల సంస్థ జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు. ఐటీ కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈయనను పద్మశ్రీ వరించింది.