భారీగా పెరిగిన సిమెంట్ ధరలతో బిల్డర్లకు చుక్కలు..ధరల నియంత్రణ చెయ్యని ప్రభుత్వాలపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గృహ నిర్మాణం సామాన్యులకు భారంగా మారుతోంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో భూముల మార్కెట్ విలువ పెంచడంతో, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు జరుగుతోంది. ఇక ఇదే సమయంలో సిమెంట్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. తద్వారా సగటు గృహ నిర్మాణ దారులకు, బిల్డర్లకు ఇంటి నిర్మాణం మరింత ప్రియంగా మారనుంది.
గృహ నిర్మాణదారులకు ధరాఘాతం శరాఘాతం
ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రారంభం కావడంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు, సిమెంట్ ధరలు కూడా పెరిగాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇప్పటికే పలు జిల్లాలలో కొత్త జిల్లాల ప్రకటనలతో భూముల మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ భూముల మార్కెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో గృహ నిర్మాణానికి సంబంధించిన ముడి సరుకు ధరలు కూడా విపరీతంగా పెరగడం ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారికి ధరాఘాతం శరాఘాతంగా తయారైంది.
విపరీతంగా పెరుగుతున్న సిమెంట్ ధరలు .. బస్తాల ధర రూ.350 నుంచి రూ.400కి
బిల్డర్లకు సైతం ఖర్చు విపరీతంగా పెరగనుంది. పెద్దగా సంపాదన లేని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు, బిల్డర్లు సిమెంట్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మంగళవారం ఒక్కరోజే సిమెంట్ బస్తా ధర రూ.50 పెరిగింది. నాలుగు నెలల్లో మూడు విడతలుగా బస్తా ధర రూ.100 పెరిగింది. మార్కెట్లో విక్రయించే అన్ని రకాల సిమెంట్ల ధరలను కంపెనీలు పెంచాయి. ప్రధాన కంపెనీల సిమెంట్ బస్తాల ధర రూ.350 నుంచి రూ.400కి పెరిగిందని వ్యాపారులు చెప్తున్నారు.
ఏపీ,తెలంగాణా ప్రభుత్వాలపై బిల్డర్ల అసహనం
పెరుగుతున్న సిమెంట్ ధరలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శలు వెల్లువ గా మారుతున్నాయి. ప్రభుత్వం అండదండలతోనే సిమెంట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా సిమెంట్ ధరలను పెంచుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఉన్న సత్సంబంధాలు కూడా సిమెంట్ ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బంధువులకు సిమెంట్ కంపెనీ ఉండడంతో కేసీఆర్ సిమెంట్ ధరల పెంపునకు అనుమతిస్తున్నారని బిల్డర్లు ఆరోపిస్తున్నారు. సిమెంట్ ధరలు అదుపులేకుండా పెరగడం బిల్డర్లకు మోయలేని భారంగా మారింది.
సిమెంట్ ధరలను తగ్గించి నిర్మాణ వ్యయం తగ్గించాలని బిల్డర్ల డిమాండ్
మార్కెట్లో నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో గృహ నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకు పోతోంది. ధరల పెరుగుదల కారణంగా నిర్మాణ వ్యయం 20 శాతం పెరిగినట్లు ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖర్చు పెరిగిపోవడంతో నిర్మాణాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు వాపోతున్నారు. ఇక ఈ పరిస్థితులు ఇలానే ఉంటే భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ధరలను నియంత్రించి నిర్మాణ రంగాన్ని కాపాడాలని బిల్డర్లు కోరుతున్నారు. నిర్మాణ రంగం దెబ్బతినకుండా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని సిమెంట్ ధరలను నియంత్రించాలని బిల్డర్లు కోరుతున్నారు.