Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్ఫండ్?'
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచమంతా ఆరోగ్యం పైన మరింత దృష్టి సారించింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో సామాన్యుల నుండి ప్రభుత్వాల వరకు హెల్త్ కోసం ప్రత్యేక ఫండ్కు సిద్ధమయ్యారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్లో హెల్త్కు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించి అంచనాలు ఎక్కువే ఉన్నాయి. గతంలో రూ.67,000 కోట్లు కేటాయించగా ఈసారి రెండింతలకు పెంచి రూ.1.3 లక్షల కోట్లుగా ఉండవచ్చునని భావిస్తున్నారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు
ప్రధానమంత్రి హెల్త్ ఫండ్?
కరోనా పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ కేటాయింపుల కోసం అధిక డిమాండ్ నేపథ్యంలో ఈ బడ్జెట్లో గతంలో కంటే నిర్మలమ్మ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2025 నాటికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతం ప్రజారోగ్య వ్యయం చేరుకోవడానికి ప్రభుత్వం కొత్త నిధిని ఏర్పాటు చేయవచ్చునని భావిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నిధులను కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదన చేయవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం జీడీపీలో ఆరోగ్య వ్యయం 1.4 శాతంగా ఉంది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే ఇది తక్కువ. ఈ ఫండ్ కోసం బడ్జెట్లో ప్రతిపాదన వస్తే దీనిని ప్రధానమంత్రి గొడుకు కిందకు తీసుకు రావొచ్చునని, ఇది స్వల్ప, దీర్ఘకాలిక ప్రాధాన్యతలపై దృష్టి సారించవచ్చునని అంటున్నారు.
హెల్త్ పరిశ్రమ ఏం కోరుకుంటోంది
ఈ బడ్జెట్పై హెల్త్కేర్ పరిశ్రమ భారీగానే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఆరోగ్య రక్షణకు అవసరమైన మౌలిక వ సతుల కల్పనకు ఈ బడ్జెట్లో తగినన్ని నిధులు సమకూర్చాలని కోరుతోంది. కొత్త ఔషధాల అభివృద్ధి కోసం గతంలో ఫార్మా కంపెనీలు చేసే పరిశోధన, అభివృద్ధి ఖర్చులకు ఆదాయ పన్ను చట్టం కింద 200% మినహాయింపు ఉండేది. ఖర్చుల హేతుబద్దీకరణ కోసం ఈ మినహాయింపులను తొలగించారు. ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి మళ్లీ ఈ పన్ను ప్రోత్సాహకాన్ని పునరుద్ధరించాని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
హాస్పిటల్స్ కోసం..
కరోనా కారణంగా ప్రయివేటు ఆసుపత్రులు చాలావరకు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రోత్సాహకాలు కోరుకుంటోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆసుపత్రుల ఏర్పాటుకు రాయితీ ధరలతో స్థలాలు కోరుతున్నారు. జీఎస్టీ నిబంధనలను సరళీకృతం చేయాలని కోరుతున్నారు. ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరాన్ని కరోనా మరోసారి గుర్తు చేసిందంటున్నారు.