Budget 2022 Highlights: ఉద్యోగులకు నిరాశ, కరోనా టైంలో ఈ రంగాలకు పెద్దపీట
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన వివిధ రంగాలు, సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్ ముఖ్యంగా వేతనజీవులకు నిరాశని కల్పించింది. కానీ వివిధ రంగాలకు పెద్దపీట వేయడం గమనార్హం. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాలు, విద్య, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, రక్షణ రంగం సహా వివిధ రంగాలకు భారీ ప్రతిపాదనలు చేశారు నిర్మలమ్మ. నిర్మలమ్మ ప్రసంగం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. తాజా బడ్జెట్లోని కీలక అంశాలు.
వేతనజీవులకు నిరాశ
వేతనజీవులకు నిర్మలా సీతారామన్ పన్ను మినహాయింపులకు సంబంధించి ఎలాంటి ఊరటను కల్పించలేదు. చాలామంది ఉద్యోగులు ఆదాయపు పన్ను మినహాయింపులపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.1.50 లక్షల నుండి రూ.2 లక్షలకు, పీఎఫ్ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షలకు.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ వీటిపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలులో మాత్రం కాస్త ఊరట కల్పించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. అంటే రిటర్న్స్ సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ డిడక్షన్ పరిమితిని 14 శాతానికి పెంచుకునే అవకాశం కల్పించారు.
క్రిప్టో కరెన్సీ
క్రిప్టో కరెన్సీపై ఈ బడ్జెట్లో స్పష్టతను ఇచ్చారు. ఒకటి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకు వస్తుందని చెప్పడంతో పాటు, క్రిప్టో కరెన్సీ లాభాలు, ట్రాన్సాక్షన్స్ పైన 30 శాతం పన్నులు ఉంటాయని ప్రకటించారు. క్రిప్టో మార్కెట్ ఎప్పటి నుండో స్పష్టతను కోరుకుంటోంది.
దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇచ్చారు.
త్వరలో ఈ-పాస్పోర్ట్ విధానం.
వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పులు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్స్.
400 వందే భారత్ రైళ్లు.
25 ఏళ్ళ అమృత కాలానికి బడ్జెట్ పునాది.
కాపెక్స్ టార్గెట్ 35.4 శాతానికి పెంపు. రూ.5.54 లక్షల నుండి రూ.7.50 లక్షలకు పెంపు.
ప్రపంచ దేశాల్లో అత్యధిగ వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ముందు ఉన్నది.
ECLGS కవర్ రూ.50,000 నుండి రూ.5 లక్షల కోట్లకు.
ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా 14 రంగాలకు భారీ ప్రయోజనం.
వీటికి ప్రాధాన్యత
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత వంటి ఏడు అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.
రక్షణ రంగానికి, విద్యకు, వ్యవసాయం, ఎస్ఎంఎస్ఈ, మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యారంగంపై దృష్టి సారించారు. డిజిటల్ యూనివర్సిటీ స్థాపిస్తున్నట్లు తెలిపారు. పీఎం విద్యలో భాగంగా టీవీ ఛానల్స్ సంఖ్యను 12 నుండి 200కు పెంచుతున్నారు. ఈ-కంటెంట్లో నాణ్యతను పెంచనున్నామని, డిజిటల్ యూనివర్సిటీని స్థాపిస్తామన్నారు.
వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేశారు. వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పు, జీరో బడ్జెట్ ఫార్మింగ్, సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం కొత్త పోర్టల్ ఏర్పాటు. ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ప్లాట్ఫామ్ ఏర్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ పెంపు కోసం స్టార్టప్స్కు ఆర్థిక సాయం. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం.
రక్షణ రంగానికి సంబంధించి దేశీయంగా తయారీకి అధిక ప్రాధాన్యం. పంటల మదింపు, భూరికార్డ్స్ డిజిటలీకరణ, పురుగు మందు వినియోగంలో డ్రోన్స్ సహకారం. సాగు రంగంలో యాంత్రీకరణకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం.