Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్లో మార్పులు?
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ బడ్జెట్ పైన ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రధానంగా ఎప్పటిలాగే ఆదాయపు పన్నుకు సంబంధించి సవరణలు ఆశిస్తున్నారు. ప్రస్తుత కీలక పరిస్థితుల్లో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంచేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం సామాన్యులకు పలు పన్ను ప్రయోజనాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు ఉండవచ్చునని లేదా శాలరైడ్కు కొంత రిలీఫ్ ప్రకటించవచ్చునని భావిస్తున్నారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు
ఈ మినహాయింపులు ఉండవచ్చు
సహజంగానే ప్రతి బడ్జెట్ సమయంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఈసారి కరోనా వల్ల మరిన్ని అంచనాలు ఉన్నాయి. కరోనా కారణంగా తప్పనిసరి అయితే తప్ప ఖర్చులు పెట్టడం లేదు. అందుకే డిమాండ్ పూర్తిగా పడిపోయింది. డిమాండ్ పెంచే చర్యల్లో భాగంగా పన్ను ప్రయోజనాలు కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. డిమాండ్ పెంచితే తప్ప ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడలేదంటున్నారు. ఐటీ స్లాబుల్లో మార్పులు మినహాయింపుల పరిమితులను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50 వేల నుండి రూ.1 లక్షకు పెంచే అవకాశముంది. ఆరోగ్య బీమా ప్రీమియంపై మరింత రాయితీ, ఎల్టీసీ గడువు పెంపు, హోమ్ లోన్ వడ్డీ, అసలు చెల్లింపుపై మినహాయింపు పరిమితి పెంచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
80సీ పరిమితి రూ.3 లక్షలకు!
ఆకర్షణీయంగా మినహాయింపులు లేని ఐటీ స్లాబ్స్, ఆదాయ పన్నుపై కాకుండా ఖర్చులపై రిబేట్, అలాగే పన్ను ఉపశమనానికి బదులు మౌలిక రంగంపై ఖర్చుల పెంపు ఉండవచ్చునని అంటున్నారు. 80సీ కింద ట్యాక్స్ డిడ్షన్ లిమిట్ రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షలు లేదా రూ.3 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గతంలో 2014లో రూ.1 లక్షగా ఉన్న 80సీ పరిమితిని మోడీ ప్రభుత్వం వచ్చాక రూ.1.5 లక్షలకు పెంచింది.
సిఫార్సు
పన్ను చెల్లింపుదారుల చేతిలో నగదు ఉండేలా చూసేందుకు ప్రత్యక్ష పన్నుల టాస్క్ ఫోర్స్ పలు సిఫార్సులు చేసింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.10 లక్షల నుండి 20 లక్షల ఆదాయం ఉంటే 20 శాతం పన్ను, రూ.20 లక్షల నుండి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను, రూ.2 కోట్లకు మించి వార్షిక ఆదాయంపై 35 శాతం పన్నును సిఫార్సు చేసింది.