Budget 2020: చివరి 2 పేజీలు చదవలేకపోయిన నిర్మలా సీతారామన్, ఎందుకంటే..?
న్యూఢిల్లీ: పార్లమెంటులో శనివారం బడ్జెట్ 2020ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్రమంత్రి.. చివరి రెండు పేజీలు మిగిలి ఉండగానే తన బడ్జెట్ ప్రసంగాన్ని నిలిపివేశారు.
budget 2020: వేతన భారీ జీవులకు ఊరట, కొత్త ఆదాయపు పన్ను శ్లాబ్స్ ఇవే
స్వల్ప అస్వస్థకు గురైన నిర్మలా
బడ్జెట్పై దాదాపు రెండున్నర గంటలకంటే ఎక్కువసేపు ప్రసంగించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ తగ్గడంతో ఆమె నుదుటిపై చెమటలు పట్టాయి. ఈ క్రమంలో ఆమె కొంత ఇబ్బంది పడ్డారు. తోటి మంత్రులు ఆమెకు చక్కెర, నీటిని అందించినా ఆమె నిరాకరించారు.
స్పీకర్కు విన్నపం..
ఇక ప్రసంగాన్ని కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో.. మిగిలిన ప్రసంగాన్ని కూడా చదివినిట్లుగా పరిగణించాలని స్పీకర్ను నిర్మలా సీతారామన్ కోరారు. ఇంకా రెండు పేజీలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమె అభ్యర్థనకు అంగీకరించారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా థమ్సప్ సంకేతం చూపారు.
రికార్డు బడ్జెట్ ప్రసంగం
నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురైనట్లు గుర్తించి పలువురు ఎంపీలు ఆమె దగ్గరకు వచ్చి పరామర్శించారు. కాగా, బడ్జెట్ ప్రసంగాల్లో తాజా బడ్జెట్ ప్రసంగమే సుదీర్ఘమైనది కావడం గమనార్హం. సుమారు 2.40గంటలపాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. అంతకుముందు 2019 జులైలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో సుమారు 2గంటల 17 నిమిషాలపాటు ప్రసంగించి అప్పుడు కూడా నిర్మలా రికార్డు సృష్టించారు.
తన రికార్డును తిరగరాసిన నిర్మలా సీతారామన్..
గత రికార్డును తాజాగా నిర్మలా సీతారామన్ బ్రేక్ చేశారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ బడ్జెట్ పత్రాలను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాజ్యసభను ఛైర్మన్ వెంకయ్యనాయుడు సోమవారానికి వాయిదా వేశారు. కాగా, ఈ బడ్జెట్లో రక్షణ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేశారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఎక్కువగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆదాయపుపన్ను శ్లాబులను మార్పు చేసి వేతన జీవులకు కొంత ఊరట కల్పించారు.