వేతనజీవుల కొనుగోలు తగ్గిస్తారా? ఇన్సురెన్స్ స్టాక్స్కు ఆదాయపు పన్ను దెబ్బ
న్యూఢిల్లీ: నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ వర్గాలను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ బడ్జెట్ మార్గెట్కు అనుకూలంగా లేనట్లుగా భావించడంతో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు, నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. ఇన్సురెన్స్ కంపెనీల షేర్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ కంపెనీల నష్టానికి బడ్జెట్లో ఓ కారణం ఉంది. అది ఆదాయపున్ను అంశం.
బడ్జెట్ దెబ్బ:భారీ నష్టాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 1000పాయింట్ల డౌన్, రూ.4లక్షల కోట్ల సంపద ఆవిరి
ఊరట ప్రకటన లేకపోగా.. కొత్త విధానంలో మినహాయింపు కట్
ఇన్సురెన్స్ పాలసీలపై పన్ను మినహాయింపుల వంటి ఊరట ప్రకటనలు లేకపోవడంతో ఇన్సురెన్స్ కంపెనీల షేర్లు దాదాపు 10 శాతం మేర నష్టపోయాయి. పైగా కొత్త ట్యాక్స్ విధానం (ఐచ్ఛికం మాత్రమే)లో ఇన్సురెన్స్ పాలసీ మినహాయింపుకు చెల్లుచీటి పాడారు. పాత ట్యాక్స్ విధానం ప్రకారం ఇన్సురెన్స్ పాలసీకి మినహాయింపు ఉంది. కానీ దీని పరిమితిని పెంచలేదు. ఇక కొత్త ట్యాక్స్ విధానంలో 70 మినహాయింపులను కట్ చేశారు. ఇందులో ఇన్సురెన్స్ పాలసీ ఉంది.
ఏ షేర్ ఎంత పడిపోయిందంటే
ICICI Prudential Life Insurance Company Ltd షేర్లు 9.72 శాతం నష్టపోయి రూ.461.30 వద్ద, SBI Life Insurance Company Ltd 8.35 శాతం నష్టపోయి రూ.910.65 వద్ద, HDFC Life Insurance 5.10 శాతం నష్టపోయి రూ.568.55 వద్ద, ICICI Lombard General Insurance 1.26 శాతం నష్టపోయి రూ.1302 వద్ద, General Insurance Corporation of India షేర్లు 2.48 శాతం నష్టపోయి రూ.243.85 వద్ద, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ షేర్లు 3.76 శాతం నష్టపోయి రూ.149.85 వద్ద క్లోజ్ అయ్యాయి.
ఇన్సురెన్స్ కొనుగోళ్లు తగ్గుతాయా?
ట్యాక్స్ పేయర్స్ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఎక్కువ మేరకు మినహాయింపులు వదులుకోవాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. ఇన్సురెన్స్ ప్రీమియం ట్యాక్స్ మినహాయింపు కూడా ఇందులో ఉంది. ఈ నేపథ్యంలో శాలరైడ్ పీపుల్ ఇన్సురెన్స్ కొనడం తగ్గిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షేర్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి.