మరో కీలక అడుగు: 666 చైనా వస్తువులకు చెక్, రూ.వేలకోట్లు ఆదా, అదొక్కటే ఆందోళన..
2013-14 నుండి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు భారత టాప్ వ్యాపార భాగస్వామిగా చైనా ఉండగా, గత రెండేళ్లు దానిని అమెరికా అధిగమించింది. కరోనా, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనానుండి దిగుమతులు మరింతగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు చైనా నుండి దిగుమతులు తగ్గిస్తామని, ఇక్కడే తయారు చేస్తామని చెబుతున్నాయి.
ఆటో మొబైల్ పరిశ్రమ కూడా సాధ్యమైనంత మేరకు లోకల్ తయారీని ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఇందుకు ఆటో దిగ్గజాలు మారుతీ సుజుకీ, మహీంద్రా మహీంద్రా వంటివి విడిభాగాల ఉత్పత్తి కంపెనీలకు అండగా ఉండనున్నాయి. వివిధ రకాల ఉత్పత్తులు ఇక్కడే తయారు చేస్తే చైనా నుండి దిగుమతులు తగ్గి, వాణిజ్య లోటు కూడా మెరుగుపడుతుంది.
ఇక చైనాకు చెక్, భారత్ టాప్ వ్యాపార భాగస్వామిగా అమెరికా! అగ్రరాజ్యంతో మరింత దృఢంగా..
666 వస్తువులు.. చైనా నుండి అవసరం లేదు
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (FISME) ప్రస్తుతం చైనా నుండి దిగుమతి చేసుకుంటూ... ఇక నుండి ఇక్కడే తయారు చేసుకోగలిగిన 666 రకాల వస్తువులను గుర్తించింది. ఇందులో ఎలక్ట్రిక్ ల్యాంప్స్, వుడెన్ ఫర్నీచర్, ట్రైసైకిల్స్, స్కైబూట్స్ వంటి వస్తువులను గుర్తించింది. దీంతో పొరుగుదేశం నుండి ఏడాదికి 10 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు తగ్గుతుందని అంచనా వేసింది. వాణిజ్యమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు FISME దిగుమతులు అవసరం లేని వస్తువులను గుర్తించింది.
ఇక్కడ తయారు చేసినా.. ఖర్చు పెద్దగా ఉండదు
ప్రధానంగా చైనా నుండి MSMEలు దిగుమతి చేసుకునే 600కు పైగా వస్తువులను గుర్తించామని, వీటిలో అధిక ట్యాక్స్ విధించే వస్తువులను విశ్లేషిస్తున్నామని FISME సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ అన్నారు. కొన్ని సందర్భాలలో తక్కువ విలువైన వస్తువులను తయారు చేసుకోగలమని, కొన్నిసార్లు దిగుమతులు ప్రత్యామ్నాయం అవుతాయన్నారు. దీనిపై వివరంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సిఫార్సుల్ని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. తాము గుర్తించిన ఎన్నో వస్తువులను స్థానికంగా తయారు చేయగానికి పెద్దగా టెక్నాలజీ అవసరం లేదన్నారు. కాబట్టి ఇక్కడి సంస్థలకు అవి వ్యయ భారం కాబోవని చెప్పారు. ఏది ఏమైనా అన్నింటిని పరిశీలించి అధిక టారిఫ్కు సంబంధించి విశ్లేషిస్తామన్నారు.
ఆ వస్తువులపై దిగుమతి సుంకం పెంపు
చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇన్పుట్ ఇవ్వాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ గత నెలలో CII, FICCI, Assocham సహా ఇండస్ట్రీ బాడీని కోరింది. ఇక్కడే తయారు చేసుకోగలిగి.. చైనా నుండి దిగుమతయ్యే వస్తువులపై దిగుమతి సుంకం పెంచే అవకాశాలు ఉన్నాయి. భారత్లో తయారీని బలోపేతం చేయాలని చూస్తున్నామని, అనవసరమైన దిగుమతులు తగ్గించడం ద్వారా ఇక్కడి తయారీదారులను ప్రోత్సహించాలని భావిస్తున్నామని వాణిజ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఓ అధికారి చెబుతున్నారు. మన పరిశ్రమ బలంగా లేని స్పేస్ను చైనా దిగుమతులతో ఆక్రమించిందని, ఈ సమస్యపై పరిశీలిస్తున్నామని, ఇక్కడి తయారీని ప్రోత్సహించేందుకు టారిఫ్, నాన్-టారిఫ్ సహా వివిధ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎంఎస్ఎంఈలకు ప్రత్యామ్నాయం.. ఇక్కడే
ఇప్పటికే జేఎస్డబ్ల్యు వంటి దిగ్గజ గ్రూప్ చైనా నుండి దిగుమతులను జీరోకు తగ్గించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రకటన చేసింది కూడా. చాలా వరకు సంస్థలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. మనమే తయారు చేసుకుందామంటూ ఆనంద్ మహీంద్రా ఆటో రంగంలో తయారీదారులను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు. చాలా కంపెనీలకు, ముఖ్యంగా MSMEలు చైనా నుండి దిగుమతులు చేసుకుంటాయి. ఈ ఎంఎస్ఎంఈలకు ప్రత్యామ్నాయం భారత్ తయారీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ తర్వాతే.. లేదంటే ధరలు పెరుగుతాయి
ఎంఎస్ఎంఈలు చైనా నుండి దిగుమతుల్ని తగ్గించడాన్ని సమర్థిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మొదట ముడిపదార్థాలు, ఇతర ప్రత్యామ్నాయాలు గుర్తించాలని, ఆ తర్వాత దిగుమతులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అంతేకాదు, ముడిపదార్థాల దిగుమతిపై హఠాత్తుగా ఆంక్షలు విధిస్తే 10 శాతం నుండి 40 శాతం వరకు అధిక ఖర్చు అవుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతిమంగా తుది ఉత్పత్తులు లేదా వస్తువులు పెరగడానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఇది వినియోగదారులకు ఖర్చు పెంచడంతోపాటు డిమాండ్కు హాని కలిగిస్తుందంటున్నారు.