Anil Ambani: అనిల్ అంబానీ బ్లాక్ మనీ కేసు.. పన్ను అధికారులకు కోర్టు ప్రశ్నలు..
Anil Ambani: సంపన్న వ్యాపారవేత్త రియలన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ. వ్యాపారాలు పతనం తర్వాత ఆయనను అనేక కేసులు చుట్టుముట్టాయి. చాలా కంపెనీలు దివాలా ప్రక్రియలో భాగంగా విక్రయానికి కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ చిక్కుల్లో పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.
IT నోటీసులు..
పన్ను ఎగవేత కేసులో రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీపై ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. ఈ నోటీసుకు వ్యతిరేకంగా అనిల్ అంబానీ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంపై బాంబే హైకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ నోటీసుల విషయంలో బ్లాక్ మనీకి సంబంధించిన కొన్ని నిబంధనలు రిట్రోస్పెక్టివ్ ఎఫెట్ అంటే గతకాలం నుంచి అమలుకావటంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. పిటిషన్ విచారణ సమయంలో కోర్టు వ్యాఖ్యానిస్తూ.. భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాలను ఒక వ్యక్తి ఎలా పొందడం సాధ్యపడుతుందని ప్రశ్నించింది.
స్విస్ ఖాతాల్లో డబ్బు..
పన్ను ఎగవేత కేసులో అనిల్ అంబానీకి ఆదాయపు పన్ను శాఖ నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంలో అనిల్ అంబానీ మెుత్తం రూ.420 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ శాఖ తన నోటీసుల్లో వెల్లడించింది. అంబానీ సోదరుడు మెుత్తంగా రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రూ.814 కోట్లపై పన్ను ఆదా చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. బ్లాక్ మనీ టాక్స్ ఇంపోజిషన్ యాక్ట్-2015లోని పలు సెక్షన్ల కింద తాజాగా అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు చేరుకోవటంతో వివాదం చెలరేగుతోంది.
కేసు విచారణ..
IT నోటీసులకు ఛాలెంజ్ చేస్తూ అనిల్ అంబానీ కోర్టుకు వెళ్లటంతో బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసును ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు అనిల్ అంబానీపై కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం ఆగష్టు 8న నోటీసులు పంపిన ఐటీ అధికారులు పన్నును వ్యాపారవేత్త ఉద్దేశపూర్వకంగానే ఎగవేశారని ఆరోపించింది. స్విస్ ఖాతాలో ఉన్న డబ్బు వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయలేదంది. అందుకే బ్లాక్ మనీ యాక్స్ కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది.