కొత్త ఆదాయపు పన్ను విధానం వెనుక..: 92 శాతం మంది ఇది ఉపయోగించుకుంటున్నారు
న్యూఢిల్లీ: ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని తీసుకు వచ్చింది. అయితే పాత, కొత్త.. రెండు విధానాలు అమలులో ఉంటాయి. ట్యాక్స్ పేయర్స్ ఏ విధానాన్ని అయినా ఎంచుకునే వెసులుబాటు ఉంది. అయితే కొత్త విధానం తీసుకు రావడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. దాదాపు 92 శాతం మంది రూ.2 లక్షల కింద మినహాయింపును ఎంచుకోవడం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ ఎంచుకుంటే మీరు ఏం కోల్పోతారంటే?
91.2% మందికి రూ.2 లక్షల లోపు మినహాయింపులు
2018-19 ఏడాదిలో మొత్తం 5.78 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా ఇందులో 5.3 కోట్లమంది అంటే 91.7 శాతం మంది రూ.2 లక్షల లోపు మినహాయింపులు పొందుతున్నవారు. సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 80CCD(1B) (NPS అడిషనల్ డిడక్షన్), హౌసింగ్ లోన్ వడ్డీ రేటు తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్ వంటి మినహాయింపులు ఉపయోగించుకున్నారు.
వీరంతా కొత్త పన్ను విధానాన్ని కోరుకుంటున్నారు..
3.77 లక్షల పన్ను చెల్లింపుదారులు మాత్రమే రూ.4 లక్షల కంటే పైగా డిడక్షన్ పొందుతున్నారు. మొత్తం ట్యాక్స్ పేయర్స్లలో వీరు 1 శాతం కంటే తక్కువ. కొత్త పన్ను విధానం ఈక్విటీ సమస్యలను పరిష్కరిస్తుందని, ఉద్యోగ మార్కెట్లోకి కొత్తగా వచ్చేవారు, స్మాల్ స్కేల్ వ్యాపార యజమానులు, పదవీ విరమణ చేసిన వారు కొత్త పన్ను విధానంలోకి వెళ్లాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
కచ్చితంగా పన్ను భారం తగ్గుతుంది
ఈ కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులపై పన్ను భారాన్ని కచ్చితంగా తగ్గిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం చెప్పారు. మినహాయింపులు తగ్గించడంతో పాటు కాలక్రమేణా వాటిని కుదించడమే ప్రభుత్వ ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. కొత్త పన్ను విధానం మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి పన్ను భారాన్ని తగ్గించిందన్నారు.
మినహాయింపులు.. పరిమితం
కొత్త పన్ను విధానంలో మినహాయింపులు లేవని చెబుతున్నప్పటికీ కొన్ని మినహాయింపులు ఉన్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే ఓ వ్యక్తి కొత్త పన్ను విధానంలోకి వచ్చాక తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.
కొత్త పన్ను విధానం ఉపశమనం
కొత్త పన్ను విధానాన్ని ఎంతమంది ఎంచుకుంటారనేది అప్పుడే చెప్పలేమని రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే అన్నారు. కుటుంబ పరిస్థితులు లేదా జీవన పరిస్థితుల కారణంగా కొన్ని మినహాయింపులు పొందలేని వారికి కొత్త పన్ను విధానం ఉపశమనం కల్పిస్తుందని చెప్పారు. కొంతమందికి (మినహాయింపులు పొందలేనివారికి) పాత పన్ను విధానం నష్టం చేసేదిగా ఉంటే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
పెట్టుబడి ఎందుకు పెడతారు?
60 ఏళ్లు పైబడిన వారు ప్రావిడెంట్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారని, జీవిత బీమా ఎందుకు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వారు తీసుకునేది హెల్త్ ఇన్సురెన్స్ మాత్రమే అన్నారు. హోమ్ లోన్ కూడా తీసుకునే పరిస్థితులు తక్కువ అంటున్నారు. పెన్షన్ పొందే వ్యక్తికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుందని, అతను తన డబ్బును తనకు ఇష్టమైన దాని కోసం ఉపయోగిస్తాడని, కానీ పెట్టుబడుల కోసం ఆసక్తి ఉండదని చెబుతున్నారు.
కొత్త పన్ను విధానం..
ఇదిలా ఉండగా, వార్షిక ఆదాయం పదమూడు లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉండే ధనిక వర్గాలకు కొత్త పన్ను విధానం మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం వారు కూడా రూ.2 లక్షల లోపు వరకు మాత్రమే మినహాయింపులు పొందే అవకాశముంది. కొత్త విధానంలో మినహాయింపులు లేకపోయినా ప్రస్తుతం చెల్లించే దాని కంటే తక్కువ చెల్లిస్తారని చెబుతున్నారు. పాత విధానంతో వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉండి, ఏటా రూ.2 లక్షల వరకు మినహాయింపులు పొందుతున్న వారికి లబ్ధి ఉంటుందంటున్నారు. తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి 5 లక్షలదాకా గతంలో మాదిరిగానే 5 శాతం పన్ను ఉంటుంది. అయితే రూ.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10%, రూ.7.5 లక్షల నుంచి 10 లక్షలదాకా 15%, రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20%, రూ.12.5 లక్షల నుంచి 15 లక్షలదాకా 25%, రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉంటే 30% పన్నును ప్రకటించారు. ఏ పన్ను విధానంలో కొనసాగాలనేది ట్యాక్స్ పేయర్స్ ఇష్టం.