భారతీయ బ్యాంకుల రికార్డు- 150 ట్రిలియన్ల మైలురాయి దాటిన డిపాజిట్లు
నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో నమ్మకం సడలుతున్నా బ్యాంకుల విలీనం, ఇతర చర్యల ద్వారా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంపై సానుకూల ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముగిసిన ఆర్ధిక సంవత్సరాంతానికి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో డిపాజిట్ల విలువ రూ.150 ట్రిలియన్ల మైలురాయి దాటింది. సగటున చూసుకుంటే ఐదేళ్ల కోసారి 50 ట్రిలియన్ల డిపాజిట్లు బ్యాంకుల్లోకి చేరుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన తాజా నివేదిక చెబుతోంది.
భారతీయ బ్యాంకుల రికార్డు
భారత్లో సామాన్య ప్రజల నుంచి ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా బ్యాంకింగ్ రంగం మాత్రం నిలకడగా రాణిస్తోంది. నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో సాదారణ ప్రజల్లో బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లినట్లు కనిపించినా కేంద్రం తీసుకున్న చర్యలతో ఆ ప్రబావం డిపాజిట్లపై పడలేదు. దీంతో ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్దిక సంవత్సరంలో భారతీయ బ్యాంకులు డిపాజిట్లలో నిలకడైన వృద్ధి సాధించాయి. అంతే కాదు ప్రతీ ఐదేళ్ల కోసారి రూ.50 ట్రిలియన్ మార్కు దాటుతున్న సంప్రదాయాన్ని కూడా కొనసాగించాయి.
రూ.150 ట్రిలియన్ల డిపాజిట్ల మార్క్
గత నెలతో ముగిసిన ఆర్దిక సంవత్సరంలో భారతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.150 ట్రిలియన్ మార్క్ను దాటాయి. గతేడాదితో పోలిస్తే 11.3 శాతం డిపాజిట్ల వృద్ధితో భారతీయ బ్యాంకులు ఈ మైలురాయినిన దాటినట్లు రిజర్వుబ్యాంకు తన తాజా నివేదికలో వెల్లడించింది. 2011 ఫిబ్రవరిలో తొలిసారి రూ.50 ట్రిలియన్ల డిపాజిట్ మార్క్ అందుకున్న బ్యాంకులు, 2016 సెప్టెంబర్ నాటికి రూ.100 ట్రిలియన్ డిపాజిట్ల మార్క్కు చేరుకున్నాయి. ఇప్పుడు రూ.150 ట్రిలియన్ మార్క్ దాటడంతో బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ది నిలకడగా కొనసాగుతున్నట్లు అర్ధమవుతోంది.
భారతీయుల స్ధిరమైన నమ్మకం డిపాజిట్లపైనే
గతేడాది కాలంగా భారత ఆర్ధిక వ్యవస్ద ఎన్నో ఒడిదొడుకులకు లోనైంది. అయినప్పటికీ బ్యాంకుల్లో డిపాజిట్లు మాత్రం చెక్కుచెదరలేదు. అంతే కాదు కొత్త డిపాజిట్ల ఇన్ప్లో కూడా స్దిరంగా కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం ఖాతాదారుల్లో డిపాజిట్లపై ఉన్న నమ్మకమే. బ్యాంకులు అందించే సేవలపై నమ్మకం లేకపోయినా డిపాజిట్లపై వచ్చే స్ధిరమైన ఆదాయంపై ఖాతాదారుల్లో నమ్మకం మాత్రం సడలడం లేదు. ఈ మధ్య కాలంలో బ్యాంకులు తాము స్వీకరించే డిపాజిట్లపై వడ్డీ రేట్లను సైతం పెంచలేదు. అయినా డిపాజిట్ల ఇన్ఫ్లో కొనసాగుతుందంటే పరిస్దితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
డిపాజిట్ల స్వీకరణలో ప్రైవేట్ బ్యాంకులు భేష్
ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్ల స్వీకరణలో ముందువరుసలో ఉన్నాయి. తాజాగా ఆర్బీఐ ప్రకటించిన లెక్కల ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.13.35 ట్రిలియన్ల డిపాజిట్లతో ముందుంది. గతేడాదితో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు 16.3 శాతం వృద్ధి సాధించింది. అలాగే పెడరల్ బ్యాంకు 1.72 ట్రిలియన్ల డిపాజిట్లు సాధించింది. గతేడాదితో పోలిస్తే ఇది కూడా 13 శాతం వృద్ధి చెందింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ సైతం గతేడాదితో పోలిస్తే 27 శాతం వృద్ధితో 2.56 ట్రిలియన్ల డిపాజిట్లకు చేరుకుంది.
మ్యూచువల్ ఫండ్లలో పెరుగుతున్న అవుట్ఫ్లోలు కూడా బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్దికి కారణమవుతున్నట్లు ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి.