స్మార్ట్ఫోన్ ఉపయోగం 25% పెరిగింది, సెల్ఫీ టైమ్ జంప్
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాస్లు వంటి వివిధ కారణాలతో స్మార్ట్ ఫోన్ ఉపయోగం పెరిగింది. అలాగే ఖాళీ సమయంలో సినిమాలు, వీడియోలు చూసేందుకు స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. దీంతో రోజులో సగటున ఏడు గంటల పాటు సెల్ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ మేరకు సీఎంఆర్-వివో సర్వేలో వెల్లడైంది. 2019లో రోజులో సగటున 4.9 గంటలు, 2020 మార్చిలో 5.5 గంటల సేపు స్మార్ట్ ఫోన్ వినియోగించారు. ఆ తర్వాత లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. దీంతో ఏప్రిల్ నెలలో ఫోన్ వినియోగం 25 శాతం పెరిగి 6.9 గంటలకు చేరింది.
నాన్సెన్స్! మిస్త్రీకి మరో షాకిచ్చిన టాటా సన్స్, ఆ సెటిల్మెంట్కు నో
నివేదికలోని అంశాలు..
హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే నగరాల్లో 2000 మంది ద్వారా సర్వే చేశారు. ఈ సర్వే నివేదిక ప్రకారం మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం కారణంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగం 75 శాతం పెరిగింది. కాల్స్ చేసేందుకు 63 శాతం, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ మాధ్యమాలు తిలకించేందుకు 59 శాతం పెరిగింది. 84 శాతం మందికి నిద్రలేచిన మొదటి 15 నిమిషాల్లోనే తమ ఫోన్ను చూడటం అలవాటు. తమ ఫోన్ వినియోగ తీరును ఎత్తి చూపుతున్నట్లు ప్రతి 8 మందిలో ఏడుగురు అంగీకరించారు.
కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరిగింది
కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా పెరిగింది. కరోనాకు ముందు రోజుకు 4.4 గంటలుగా ఉంటే, ఇప్పుడు 5.5 గంటలుగా ఉంది. అదే సమయంలో సన్నిహితులతో గడిపే సమయం తగ్గింది. సెల్ ఫోన్ వినియోగం ఇలాగే పెరుగుతూ ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని 70 శాతం మంది తెలిపారు. కరోనా ప్రభావం తగ్గితే సెల్ ఫోన్ వినియోగం కూడా తగ్గవచ్చునని వివో ఇండియా డైరెక్టర్ నిపున్ తెలిపారు.
సెల్ ఫోన్ వినియోగం పెరుగుదల ఇలా...
2019 మార్చిలో సగటున 4.9 గంటలుగా ఉన్న సెల్ ఫోన్ వినియోగం, 2020 మార్చి నాటికి 5.5 గంటలకు పెరిగింది. లాక్ డౌన్ తర్వాత ఏప్రిల్లో ఏకంగా 25 శాతం పెరిగి 6.9 గంటలకు పెరిగింది. ఇతరులతో మాట్లాడటానికి వెచ్చించే సమయం 63 శాతం పెరగగా, ఓటీటీ, ఎంటర్టైన్మెంట్ చానల్స్ వీక్షించే సమయం 59 శాతం పెరిగింది. సోషల్ మీడియాకు 55 శాతం, మొబైల్ గేమ్స్కు 45 శాతం పెరిగింది. సెల్ఫీలు తీసుకునే సమయం కూడా 14 నిమిషాల నుండి 18 నిమిషాలకు పెరిగింది.
విచారం.. అసహనం
15 ఏళ్ల నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిని 2,000 మంది నుండి అభిప్రాయాన్ని తీసుకున్నారు. స్మార్ట్ఫోన్ ద్వారా ఎన్నో పనులు సులభంగా అవుతున్నప్పటికీ, చాలామంది అదే విధంగా ఫోన్ చూస్తూ సమయం వృధా చేసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇంట్లో కూడా చాలామంది సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్ లేకుంటే అసహనం లేదా విచారం కలుగుతుందని 76 శాతం మంది చెప్పారు.