ఆటో రీస్టార్ట్: కార్లు, బేక్స్ అమ్మకాలు షురూ.. త్వరలో ఉత్పత్తి, ఇప్పుడు కొత్త సమస్య
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ రంగం కుదేలైన విషయం తెలిసిందే. ఉత్పత్తి నిలిచిపోయి, డీలర్షిప్స్ క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఇవి క్రమంగా తెరుచుకుంటున్నాయి. త్వరలో తయారీ పునరుద్ధరణ ప్రారంభం కానుంది. మారుతీ సుజుకీ 600 డీలర్షిప్స్ను పునఃప్రారంభించింది. అదే బాటలో ఇతర కంపెనీలు నడవనున్నాయి. ఏప్రిల్ నెలలో కంపెనీలు ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేదు. లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో ప్లాంట్స్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
H1B వీసాదారులకు దిగ్గజ కంపెనీలు ఇచ్చే వేతనం తక్కువే! మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా కంపెనీల్లో ఇలా..
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ... మారుతీ సుజుకీ ఓపెన్
ఉద్యోగులు, కొనుగోలుదార్ల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ కార్యకలాపాలు చేపడుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ప్రభుత్వాల సూచనల మేరకు పరిమిత సంఖ్యలో సిబ్బందితో మొదలు పెడుతున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 600 సేల్స్ పాయింట్స్లలో కార్యకలాపాలను పునరుద్ధరించామని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఆన్ లైన్ ద్వారా వాహన అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్థకు దేశవ్యాప్తంగా 1,960 పట్టణాలు, నగరాల్లో 3,080 కేంద్రాలు ఉన్నట్లు చెప్పారు. లాక్ డౌన్ అనంతరం 474 ఎరీనా, 80 నెక్సా, 45 వాణిజ్య విక్రయ కేంద్రాలను తెరిచింది. మానేసర్ ప్లాంటులో తయారీని మే 12వ తేదీన ప్రారంభిస్తామన్నారు.
హ్యాండాయ్ ఓపెన్.. ఏపీలో ఇసుజు రెడీ
హ్యుండాయ్ కంపెనీ కూడా 500 విక్రయ కేంద్రాల్లో 250 చోట్ల వాహనాల డెలివరీని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. చెన్నై ప్లాంటులో వాహనాల తయారీని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా తమ ఫ్యాక్టరీలు అన్నింటిలో కార్యకలాపాలు ప్రారంభించినట్లు టీవీఎస్ తెలిపింది. యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా కూడా ఏపీలోని శ్రీసిటీ ప్లాంటులో కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చినట్లు తెలిపింది. తయారీకి సిద్ధమైంది.
ఐచర్ మోటార్స్.. ట్రాక్టర్ డీలర్ షిప్స్
ఐచర్ మోటార్స్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ చెన్నై సమీపంలోని ఒరగాడమ్ తయారీ యూనిట్లో కార్యకలాపాలు బుధవారం ప్రారంభించింది. ఈ సంస్థకు తిరువొత్తియార్, వల్లమ్ వడకల్ వద్ద కూడా ప్లాంట్స్ ఉన్నాయి. తొలుత ఒరగాడమ్ ప్లాంట్స్లో కొద్దిమంది సిబ్బందితో ఒకే షిఫ్ట్గా పనులు ప్రారంభించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు యాభై శాతం ట్రాక్టర్ డీలర్ షిప్స్ కూడా తెరుచుకున్నాయి. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు పెద్దగా లేకపోవడం బుధవారం విక్రయ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.
సిబ్బంది సమస్య
తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిబ్బంది కొరత సమస్యగా మారిందని హోండా కార్స్ ఇండియా తెలిపింది. రాజస్థాన్లోని తపుకరా ప్లాంటుకు అనుమతులు గత వారమే వచ్చినప్పటికీ ప్రయాణాలపై ఆంక్షలతో కార్మికులు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. వచ్చే వారం కార్యకలాపాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. అనుమతులు, సిబ్బంది కొరత సమస్యను అధిగమించాక గ్రేటర్ నోయిడా ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. హ్యుండాయ్ కు కూడా కొన్ని చోట్ల సిబ్బంది సమస్య ఉందని తెలుస్తోంది.