2022లో శాలరీ భారీగా జంప్, ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాలు సూపర్
2022లో వేతన పెంపు సగటున 8.6 శాతంగా ఉంటుందని, ఇందులోను ఐటీలో అత్యధిక వేతన పెంపు కనిపిస్తోందని డెలాయిట్ సర్వే పేర్కొంది. ఉద్యోగుల వేతన పెంపు వచ్చే ఏడాది నాటికి కరోనా ముందుస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. కరోనా-లాక్డౌన్ ఆంక్షలతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డెలాయిట్ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు 25 శాతం సంస్థలు 2022 నాటికి రెండంకెల వృద్ధి సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశాయి. కరోనా ఆంక్షల కారణంగా వేతన పెంపు సగటున 4.4 శాతానికి క్షీణించింది. కానీ ఇటీవల వ్యాపార రంగం పుంజుకుంటోంది. దీంతో ప్రస్తుత పెంపు సగటున 8 శాతానికి చేరుకుందని, వచ్చే ఏడాదికి మరింత పెరిగి 8.6 శాతానికి చేరుకుంటుందని తెలిపింది.
ఐటీ రంగంలో అధిక వేతనాలు
ఈ వేతన పెంపులో భాగంగా 2022లో ఐటీ రంగంలో వేతనాలు అధికంగా పెరగనున్నాయని పేర్కొంది. కొన్ని కంపెనీలు రెండంకెల పెంపును కూడా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపంది. ఐటీ తర్వాత లైఫ్ సైన్సెస్లో అధిక వేతనాలు కనిపిస్తున్నాయి. రిటైల్ రంగం, హాస్పిటాలిటీ, రెస్టారెంట్, మౌలిక వసతులు, రియాల్టీ రంగంలో మాత్రం వేతన పెంపు మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది. నైపుణ్యం, పనితీరును బట్టి సంస్థలు పెంపును నిర్ణయిస్తున్నట్లు తెలిపింది. సగటు పనితీరు కనబరిచే వారి కంటే బాగా రాణించిన వారికి 1.8 రెట్లు అధిక వేతనం ఉంటుందని అంచనా వేసింది. 2020లో పది శాతంగా ఉన్న పదోన్నతులు, 2021 నాటికి పన్నెండు శాతానికి పెరిగాయి. దాదాపు 78 శాతం కంపెనీలు నియామకాలను కరోనా మునుపటిస్థాయిలో చేపడుతున్నట్లు తేలింది.
బీమా పాలసీ సవరణ
పెంచిన వేతనాలకు అనుగుణంగా భత్యాలు, ఇతర ప్రయోజనాలు సవరించిన కంపెనీలు పన్నెండు శాతంగా ఉన్నాయి. అలాగే, అరవై శాతం కంపెనీలు కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలను సవరించాయి. రంగాలవారీగా చూస్తే 96 శాతం టెక్ కంపెనీలు హైరింగ్స్ కరోనా ముందుస్థాయికి(2019) చేరుకుంటాయని తెలిపాయి. సర్వీస్ రంగంలో ఇది 48 శాతం కాగా, కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో వరుసగా 73 శాతం, 77 శాతంగా ఉంది. పైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఎనేబుల్డ్ సర్వీసెస్ రంగాల్లో వరుసగా 89 శాతం వరకు ఉంది. ఇక లైఫ్ సైన్సెస్లో (ఐటీ రంగం తర్వాత) 94 శాతంగా ఉంది.
ఆట్రిషన్ కారణాలు
దేశవ్యాప్తంగా చూస్తే ఆట్రిషన్కు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని ఈ సర్వే తెలిపింది. కంపెన్షేషన్ అండ్ ప్రయోజనాలు, కంపెనీలో మన పాత్ర అండ్ కెరీర్ పాత్, పరిమిత అంతర్గత వృద్ధి అవకాశాలు. మరిన్ని ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్స్/ఫ్రీలాన్స్ వర్కర్స్ అంశంపై ప్రశ్నించగా 17 శాతం మాత్రమే కొనసాగింపును ధృవీకరించారు.
ఫ్రాన్స్ కంపెనీ వేలాది నియామకాలు
ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది భారతదేశంలో 15,000 మంది ఉద్యోగుల నియామకానికి ఫ్రాన్స్ టెక్ సంస్థ అటోస్ సిద్ధమైంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు భారత్లో ఇప్పటికే పని చేస్తోన్న 40,000 మంది ఉద్యోగులకు అదనంగా నియమించుకోనుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ వెల్లడించారు. డిజిటలీకరణ వేగం పుంజుకోవడంతో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో డిమాండ్ ఊపందుకోవడం కొత్త ఉపాధి అవకాశాలకు బాటలుపరిచిందన్నారు. ప్రపంచంలో ఈ నైపుణ్యాలు అధికంగా భారత యువతలో ఉన్నాయన్నారు.