7 నెలల్లో కేంద్రం నుంచి ఏపీకి గ్రాంట్స్, ట్యాక్స్ ద్వారా ఎంత వచ్చిందంటే?
అమరావతి: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. కొత్త రాష్ట్రం కాబట్టి కేంద్రం ఆర్థిక సహకారం అందించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయింది. కేంద్రం నుంచి పన్నులు, గ్రాంట్స్ రూపంలో పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. ఇందులో రూ.22,862 కోట్లు నిధులు వచ్చాయి. పన్నుల రూపంలో రూ.13,398 కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.9,475 కోట్లు అందాయి.
తప్పిన జగన్ ప్రభుత్వం అంచనాలు, భారమవుతున్న ఖర్చులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2,27,975 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను రూపొందించింది. ఇందులో కేంద్రం నుంచి పన్నుల వాటాగా రూ.34,833 కోట్లు, గ్రాంట్స్ వాటా కింద రూ.61,071 కోట్లను ఆశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన దాంట్లో ఏడు నెలల్లో దాదాపు నాలుగోవంతు రాష్ట్రానికి వచ్చింది. మిగిలిన ఐదు నెలల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆర్థిక శాఖ ఆశలు పెట్టుకుంది.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాజధాని అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు వేలాది కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. వీటి కోసం కోట్లాది రూపాయల నిధులు కావాలి. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అలాగే, అమరావతి వంటి వాటికి కూడా కేంద్రం సహకరిస్తోంది.