ఆటో స్పేర్స్లో లక్ష ఉద్యోగాలు కట్, 10% కంటే ఎక్కువగా పడిపోయిన టర్నోవర్
ప్రపంచవ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ప్రభావితమైంది ఆటో పరిశ్రమ. దాదాపు ఏడాది కాలంగా ఆటో సేల్స్ పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింతగా దిగజారాయి. డిమాండ్ తగ్గడంతో పలు ఉత్పత్తి ప్లాంట్లు మూసేశారు. దీంతో ఉద్యోగాల్లోను కోత పడింది. ఆటో పరిశ్రమ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఆటో స్పేర్స్లో ఈ ఏడాది జూలై నాటికి 1 లక్ష మంది తమ తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయారని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ACMA) శుక్రవారం తెలిపింది.
10 శాతం తగ్గిన టర్నోవర్
ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ గత ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ కాలంలో రూ.1.99 లక్షల కోట్లుగా ఉంటే, ఈ ఏడాది ఇదే కాలంలో 10.1 శాతం తగ్గి రూ.1.79 లక్షల కోట్లుగా ఉందని ACMA తెలిపింది. మందగమనం కారణంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నిలిచిపోయినట్లు పేర్కొంది. అయితే ఎగుమతులు 2.7% పెరిగి రూ.51,397 వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. ఆఫ్టర్ మేకర్ సెగ్మెంట్ 4% పెరిగి రూ.35,096 కోట్లు (5.1 బిలియన్ డాలర్లు)గా ఉంది. దిగుమతులు 6.7 శాతం తగ్గి రూ.57,574 కోట్లుగా ఉన్నాయి.
20 శాతం వరకు ఉత్పత్తిలో తగ్గుదల
ఆటోమొబైల్ పరిశ్రమ దీర్ఘకాలిక మందగమన పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని, అన్ని సెగ్మెంట్లలో గత ఏడాది విక్రయాల క్షీణించాయని, వాహన అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో ఉత్పత్తి సంస్థలు 15% నుంచి 20% వరకు తమ ఉత్పత్తిని తగ్గించుకున్నాయని పేర్కొంది. అంతకుముందు 2013-14 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ 2 శాతం తగ్గింది. BS-6 ప్రమాణాలను ప్రవేశపెట్టడానికి సంస్థలు రూ.80-90 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాయి.
అంతకుమించి గడ్డు పరిస్థితి
అటో కంపోనెంట్స్ ఉత్పత్తి తగ్గడంతో తాత్కాలిక ఉద్యోగులు దాదాపు లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారని ACMA ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. 2013.-14 తర్వాత మళ్లీ అంతకుమించి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ నుంచి జూలై వరకు కంపెనీలు తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయని, దాదాపు లక్ష మందిని తొలగించినట్లు తెలిపారు. విడిభాగాల పరిశ్రమ సామర్థ్య వినియోగం 50 శాతం పడిపోయినట్లు తెలిపింది. గతంలో ఇది గరిష్టంగా 80 శాతం నమోదయింది.
వీరిదే రూ.35వేల కోట్ల
వాహన పరిశ్రమ విక్రయాలు క్షీణించడంతో పరిశ్రమ ఒడిదుడుకుల్లో ఉందని, దీంతో వాహన విడిభాగాల పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాహన పరిశ్రమ బీఎస్ 6కి మారుతుండటంతో రూ.80వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టింది. ఇందులో విడిభాగాల పరిశ్రమ వాటా రూ.30వేల కోట్ల నుంచి రూ.35వేల కోట్లు. ప్రభుత్వం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని, అలాగే వాహన విడిభాగాల పరిశ్రమలో 70 శాతం వాటా చిన్న, మధ్య తరహా సంస్థలదేనని (MSME) కాబట్టి వీటికి నిర్వచనం మార్చాల్సి ఉందని, అప్పుడే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు వీరికి అందుతాయని దీపక్ జైన్ అన్నారు.