బడ్జెట్ 2020: కార్పోరేట్ పన్ను ప్రోత్సాహాలకు నో! ఆదాయపు పన్ను రేటు మాటేమిటి?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2020న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. అయితే వినిమయశక్తి కూడా తగ్గిపోయిన నేపథ్యంలో ఆ దిశగా కూడా కేంద్రం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్తో పాటు ఆదాయపు పన్ను రేట్లలో తగ్గింపు వంటి చర్యలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుల చూపు నిర్మల బడ్జెట్పై ఉంది.
బడ్జెట్లో పన్ను ప్రోత్సాహాలకు నో ఛాన్స్!
వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో శాలరైడ్కు ఆర్థికమంత్రి వరాలు ఇస్తారా, ఆదాయపు పన్ను తగ్గిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మందగమనం నేపథ్యంలో కార్పోరేట్ పన్ను తగ్గించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో పన్ను ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు ద్వారా ఏకంగా ఖజానాపై రూ.1.45 లక్షల కోట్ల మేర ప్రభావం పడింది. కాబట్టి ఇప్పుడు మరోసారి తగ్గించే అవకాశాలు తక్కువే.
గత ఏడాదిలో జీఎస్టీ భారీ ఊరట
అలాగే, 2019లో చాలా వస్తువులపై జీఎస్టీ రేటును తగ్గించింది మోడీ ప్రభుత్వం. ఎన్నో వస్తువులను అధిక జీఎస్టీ స్లాబ్ నుంచి తక్కువ జీఎస్టీ స్లాబ్స్కు తీసుకు వచ్చింది. దీంతో ఇప్పటికే జీఎస్టీ కలెక్షన్లు తగ్గుతున్నాయి. రియల్ ఎస్టేట్, విద్యుత్ వాహనాలు, హాస్టల్ వసతి, డైమండ్ మేకింగ్ వంటి వివిధ రంగాలకు గతంలోనే భారీ ఊరట కల్పించారు.
సామాన్య ప్రజల ఆశలు మాత్రం...
జీఎస్టీ తగ్గుదల, కార్పోరేట్ పన్ను తగ్గదలకు తోడు ఆర్థిక మందగమనం వల్ల వసూళ్లపై ప్రభావం పడింది. దీంతో ప్రభుత్వం ఆదాయ లక్ష్యాలను చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఆ దిశలో ట్యాక్స్ కట్టింగ్స్ ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. కానీ ఈ లెక్కలు తెలియని సామాన్యులు మాత్రం మోడీ ప్రభుత్వం ప్రజలకు ప్రతిసారి వరాలు ఇస్తుందని, ఈసారి కూడా అలాగే ఉంటుందని భావించే అవకాశాలు లేకపోలేదు.
ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలపై ఆశలు
మోడీ ప్రభుత్వం గత ఏడాది (2019)లో కార్పోరేట్ పన్ను తగ్గించింది. స్టార్టప్స్కు ఏంజెల్ ట్యాక్స్, వ్యాపారులకు జీఎస్టీ, ఫారన్ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లకు సర్ఛార్జ్ వంటి వాటిల్లో భారీ ఊరట కల్పించింది. ఈ నేపథ్యంలో వేతనజీవులకు ఈ బడ్జెట్లో పన్ను ఊరట ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. గత బడ్జెట్లో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లింపులు లేదని ప్రతిపాదించారు. స్టాండర్డ్ డిడక్షన్ ఏడాదికి రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు. ఇప్పుడు మరిన్ని ప్రోత్సాహకాలు ఉండాలని కోరుకుంటున్నారు.
వేతనజీవులకు ఊరట ఉండకపోవచ్చు
ఇప్పటికే వివిధ పన్నుల్లో కోత, వీటికి తోడు మందగమనం నేపథ్యంలో రెవెన్యూ కలెక్షన్లపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో వేతనజీవులకు ఈసారి ఊరట లభించకపోవచ్చునని భావిస్తున్నారు.
ఆదాయపు పన్ను తగ్గిస్తే...
అయితే వినియోగం నెమ్మదించినందున ఆదాయపు పన్ను తగ్గిస్తే మరింత డబ్బు వ్యవస్థలోకి వచ్చి వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో పన్ను కోత దిశగా కూడా నిర్ణయం తీసుకోవచ్చునని కొందరు అంటున్నారు.