ఎయిర్టెల్ భారీ నష్టం: కస్టమర్కు షాక్, మళ్లీ టారిఫ్ పెంచడంపై సంకేతాలు
భారతీ ఎయిర్టెల్ 2019-20 డిసెంబర్ త్రైమాసికానికి గాను రూ.1,035 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్లో రూ.86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ.20,231 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధి చెంది రూ.21,947 కోట్లకు చేరుకుంది. ఈ మేరకు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది.
1.5 బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్ట్ దక్కించుకున్న టీసీఎస్
మరోసారి ధరలు పెంచడంపై హింట్
గత ఏడాది డిసెంబర్ నెలలో టారిఫ్స్ సవరణ (పెంపు) స్వాగతించదగ్గ అంశమని, ఈ కారణంగా టెలికం సంస్థలు ఆర్థికంగా నిలదిక్కుకోవడానికి దోహదం చేస్తుందని భారతీ ఎయిర్టెల్ ఇండియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. సవరణ టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితులను మెరుగు పరుస్తుందన్నారు. ఈ సందర్భంగా మరో దఫా పెంచాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడటం గమనార్హం.
అందుకే మరోసారి పెంచే ఛాన్స్
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా టారిఫ్స్ పెంచాల్సిన అవసరం ఉందని గోపాల్ విఠల్ అన్నారు.టెలికం రంగంలో వస్తున్న టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా కొత్త టెక్నాలజీలోకి మారేందుకు మరిన్ని పెట్టుబడులు అవసరం ఉందని, దీంతో ధరలు మరోసారి పెంచక తప్పదని సంకేతాలు ఇచ్చారు.
ఆదాయం పెరిగింది.
డిసెంబర్ త్రైమాసికంలో ఎయిర్టెల్ ఆదాయం 7 శాతం పెరిగి రూ.15,797 కోట్లకు చేరుకుందని కంపెనీ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. 2018-19 ఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.23,045 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
కేంద్రానికి రూ.28,450 కోట్లు కేటాయింపు
ఏజీఆర్ సహా బకాయిలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. ఎయిర్టెల్ కేంద్రానికి రూ.28,450 కోట్లను కేటాయించింది. దీంతో సంస్థకు భారీగా నష్టం వచ్చింది. ఇందుకు తీసుకున్న రుణాలపై వడ్డీల రూపంలో అధికంగా చెల్లించడంతో లాభాల్లో గండిపడిందని గోపాల్ విఠల్ చెప్పారు. మొబైల్ డాటా వాడకంలో వృద్ధి 73% నమోదు కాగా, వీరిలో 4G డాటా కస్టమర్లు 60.6% ఎగిసి 12.38 కోట్లకు చేరుకందన్నారు.
రూ.128 నుంచి రూ.135కు పెరిగిన ఆర్పు
గత త్రైమాసికంలో కొత్తగా 2.1 కోట్ల మంది 4G సబ్స్క్రైబర్లు ఎయిర్టెల్ నెట్ వర్క్ను ఎంచుకున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి సరాసరి ఆదాయం-ARPU రూ.128 నుంచి రూ.135కి పెరిగినట్లు గోపాల్ విఠల్ చెప్పారు. కాగా, డిసెంబర్ క్వార్టర్లో రిలయన్స్ జియో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) రూ.128.4కు చేరుకుంది.