భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే ఉన్న తమ కస్టమర్ల కోసం, కొత్త కస్టమర్ల కోసం బహుళరకాల డేటా ప్లాన్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్ బేసిక్, ఎంటర్టైన్మెంట్, ప్రీమియం, వీఐపీ వంటి నాలుగు బ్రాడ్బాండ్ ప్లాన్స్ను అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ డేటా ప్లాన్స్ స్పీడ్ పరిమితి, ఫిక్స్డ్ డేటా పరిమితి కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్టెల్ అన్ని బ్రాడ్బాండ్ ప్లాన్ సబ్స్క్రైబర్లకు అపరిమిత డేటాను అందిస్తుంది. అంటే అన్ని ప్లాన్స్ పైన కస్టమర్లకు అపరిమిత డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్కెట్లోని పోటీని తట్టుకొని నిలబడేందుకు కస్టమర్లకు ఈ అవకాశం కల్పిస్తోంది.

జియో ఫైబర్కు వలస పోకుండా..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీకి చెందిన జియో ఫైబర్ సరికొత్త డేటా ప్లాన్స్తో వచ్చింది. ఈ నేపథ్యంలో తమ కస్టమర్లు జియో ఫైబర్కు వలస పోకుండా అన్-లిమిటెడ్ డేటాను అందిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన మార్పులు ఎయిర్టెల్ వెబ్ సైట్, మైఎయిర్టెల్ యాప్ ద్వారా తెలియజేయనుంది. అన్ని ప్లాన్స్ పైన ఇప్పటికే ఉన్న తమ కస్టమర్లకు అపరిమిత డేటా అందిస్తుంది. అయితే అపరిమిత డేటా ప్రయోజనం 3,300GB ఫఫ్ క్యాప్తో అందుబాటులోకి వస్తుంది.

రూ.299 అన్-లిమిటెడ్ డేటా తొలగింపు
ఎయిర్టెల్ ఇప్పటికే రూ.299 అన్-లిమిటెడ్ డేటా యాడ్-అన్ప్యాక్ను తమ వెబ్సైట్ నుండి తొలగించింది. అంటే అదనపు డేటా కోసం ప్రత్యేకంగా అమౌంట్ అవసరం లేకుండా, అందరికీ ఈ వెసులుబాటును కల్పిస్తుంది. అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్బాండ్ యూజర్లకు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రైమ్ వీడియో ప్రయోజనాలను నిలిపివేసింది.

ఇప్పటికే ఏపీ, గుజరాత్ సర్కిళ్లలో
ఎయిర్టెల్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, గుజరాత్ సర్కిళ్లలో ఎయిర్టెల్ బ్రాడ్ బాండ్ ప్లాన్స్ పైన అపరిమిత డేటాను అందిస్తోంది. ఈ అపరిమిత డేటా ప్రయోజనం 3300 GB పఫ్ క్యాప్తో లభిస్తుంది. ఆ తర్వాత స్పీడ్ లిమిట్ 1MBPSకు పడిపోతుంది. తమ కస్టమర్లు జియో ఫైబర్కు మారకుండా ఉండే చర్యల్లో భాగంగా దీనిని ప్రకటించినందున వీరు మరింత ఎక్కువ డేటాను, మంచి ధరతో పొందగలుగుతారు. జియో ఫైబర్ రూ.399 ప్లాన్ నుండి ప్రారంభమవుతోంది.


Click it and Unblock the Notifications