సుప్రీమ్ కోర్ట్ షాక్: టెలికాం లో ఉద్యోగాల కోత!
మూలిగే నక్కపై తాటి కాయ చందంలా తయారైంది భారత టెలికాం రంగం పరిస్థితి. అసలే అప్పులు, ఆపైన నష్టాలతో కునారిల్లుతున్న ఈ రంగానికి రిలయన్స్ జియో రాకతో పెద్ద దెబ్బ పడింది. రెండు మూడేళ్లు కష్టపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టెలికాం రంగానికి తాజాగా మరో దెబ్బ తగిలింది. టెలికాం రంగ కంపెనీలు ప్రభుత్వానికి సుమారు రూ లక్ష కోట్లు చెల్లించాలని ఇటీవలే సుప్రీమ్ కోర్ట్ షాక్ ఇచ్చింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజిఆర్) పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఏకీభవించిన సుప్రీమ్ కోర్ట్... ఇప్పటివరకు టెలికాం కంపెనీలు ఈ రకంగా బాకీ పడిన మొత్తాన్ని మూడు నెలల్లో ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించింది.
ఎయిర్టెల్, ఐడియాలకు షాక్, రూ.92,000 కోట్లు చెల్లించాల్సిందే
దీంతో టెలికాం కంపెనీలు దిక్కు తోచని స్థితిలో పడిపోయాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే వరకు తాజా నియామకాలు చేపట్టరాదని, ఉన్న ఉద్యోగాల్లో కూడా కోత విధించాలని టెలికాం రంగం భావిస్తోంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. సుప్రీమ్ కోర్ట్ రూలింగ్ తో అధికంగా ప్రభావితం అయ్యే కంపెనీల్లో ఎయిర్టెల్, వోడాఫోన్ - ఐడియా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి.
మొత్తంగా రూ 1.3 లక్షల కోట్లు...
సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ... మొత్తం టెలికాం రంగం సుమారు రూ 1.3 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఏజిఆర్ వివరణ ప్రకారం లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ ఫీజు ల రూపం లో కంపెనీలు ఈ మేరకు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాలి. ఇందులో భాగంగా ఒక్క ఎయిర్టెల్ కంపెనీయే రూ 41,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో వోడాఫోన్ - ఐడియా రూ 39,000 కోట్లు బకాయి పడింది. పైగా ఈ మొత్తాన్ని చెల్లించేందుకు కంపెనీలకు పెద్దగా సమయం కూడా లేదు. కేవలం మూడు నెలల్లోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని సుప్రీమ్ కోర్ట్ తేల్చి చెప్పింది.
రూ 7 లక్ష కోట్ల అప్పులు...
టెలికాం రంగం అంటేనే భారీ పెట్టుబడులు అవసరం అయ్యే రంగాల్లో ఒకటి. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోనే కాల్ టారిఫ్ లు తక్కువగా ఉంటాయి. దీంతో పెట్టుబడులపై రాబడి ఆశించిన దానికంటే తక్కువగా ఉంటుంది. దీంతో సరైన మౌలిక సదుపాయాలు, కొత్త టెక్నాలజీ, ఎక్విప్మెంట్ కోసం కంపెనీలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకొంటాయి. ప్రస్తుతం దేశంలోని టెలికాం కంపెనీలు సుమారు రూ 7 లక్షల కోట్ల అప్పుల భారంతో సతమతమవుతున్నాయి. చాలా కంపెనీలు ఈ రుణాలపై వడ్డీలు కట్టే పరిస్థితి కూడా లేదని సమాచారం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే టెలికాం రంగంపై మరో రూ 1 లక్ష కోట్ల భారం పడితే కష్టమే అని అంటున్నారు.
2 లక్ష మంది ఉద్యోగులు...
భారత టెలికాం రంగం భారీగా ఉద్యోగాలను సృష్టిస్తోంది. దేశంలో ఈ రంగం సుమారు 2 లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తోంది. పరోక్షంగా ఈ సంఖ్య పది లక్షలు దాటుతుంది. ఉచిత సేవలతో దేశీయ టెలికాం రంగంలో పాగా వేసిన రిలయన్స్ జియో మాత్రమే ప్రస్తుతం లాభాల్లో ఉంది. ఈ సంస్థ సుమారు 15,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అదే సమయం లో ఎయిర్టెల్ కు సుమారు 16,000 మంది, వోడాఫోన్ - ఐడియా కు 10,000 మంది ఉద్యోగులున్నారు. కాగా, 2017 లో మొత్తం టెలికాం రంగంలో సుమారు 3 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పటికే వారి సంఖ్య తగ్గగా.... తాజా పరిస్థితులు మరింత జఠిలంగా మారుతున్నాయి. ఉన్న ఉద్యోగులను కుదించటం, కొత్త రిక్రూట్మెంట్ ను నిలిపివేయటం, ఇంక్రెమెంట్లు, బోనస్ లు వంటి ప్రయోజనాలను కత్తిరించే పనిలో పడ్డాయి.
విన్నపాలు వినవలె...
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రమే తమను రక్షించ గలదని టెలికాం రంగ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ప్రభుత్వానికి తమ విన్నపాలు మొరపెట్టుకుంటున్నాయి. బకాయిల పై ఫైన్లు రద్దు చేయాలనీ, వీటిని చెల్లించేందుకు గడువును కూడా పొడిగించాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ను కలిసినట్లు సమాచారం. అదే సమయంలో మిట్టల్... టెలికాం శాఖ సెక్రటరీ అన్షు ప్రకాష్ ను కూడా కలిసి తమ వినతులను ఏకరువు పెట్టినట్లు తెలిసింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నప్రభుత్వం ... టెలికాం కంపెనీలకు కొంత ఉపశమనం కల్పించాలని భావిస్తున్నట్లు వినికిడి. అయితే, దానివల్ల భవిష్యత్ లో ఎటువంటి విజిలెన్సు ఇబ్బందులు రాకుండా చూసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.