హైదరాబాద్లోనే ధరలు పెరిగాయ్: ముంబై రియాల్ మార్కెట్ ఖరీదు
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయని, కానీ హైదరాబాద్లో మాత్రం పెరిగినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ప్రకటించింది. 2013 సంవత్సరం నుండి 2021 మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, కోల్కతా, చెన్నై, పుణే, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగినట్లు తెలిపింది.
ఈ మేరకు జేఎల్ఎల్ తన హోమ్ పర్చేజ్ అఫోర్డబులిటీ ఇండెక్స్ 2021 (JLL HPAI 2021) నివేదికలో వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో హోమ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు భారీగా తగ్గడం, ఇదే కాలంలో డిమాండ్ లేక ఇళ్ల ధరలు పడిపోవడం, సేల్స్ పెరగడం కోసం ప్రాపర్టీ సెల్లర్స్ భారీ ఆఫర్లు ప్రకటించడం వంటివి కలిసి వచ్చినట్లు తెలిపింది.
గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి
ఈ ఏడాదిలో కుటుంబ ఆదాయాలు గత ఏడాదితో పోల్చితే 7 శాతం నుండి 9 శాతం మేర పెరిగాయని, హోమ్ లోన్స్ పైన వడ్డీరేట్లు పదిహేనేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదారులకు అత్యంత అనుకూలమైన నగరంగా కోల్కతా ఉందని, ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్, పుణె ఉన్నట్లు వెల్లడించింది.
వెయ్యి చదరపు అడుగుల అపార్టుమెంట్ కొనుగోలుకు అవసరమైన సగటు ఆదాయం హైదరాబాద్, కోల్కతా నగరాల్లోని ప్రజలకు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇంటి కొనుగోలు శక్తి పెరిగిన నగరాల్లో హైదరాబాద్, కోల్కతాతో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే, బెంగళూరు కూడా ఉన్నాయి.
ఆదాయాలు పెరగడంతో మార్టిగేజ్ రేట్ల తగ్గుదల, ఇళ్ళ ధరల్లో స్థిరత్వంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల కొనుగోలు శక్తి పెరిగినట్లు తెలిపింది. హైదరాబాద్, కోల్కతా నగరాల్లో సగటు ఆదాయాన్ని అందుకుంటున్న వారికి 1000 చదరపు అడుగులు ఉన్న రెండు ఇళ్లకైనా లోన్ తీసుకునే అర్హత ఉంది.
హైదరాబాద్లో పెరిగిన ధరలు
2013 నుండి 2021 మధ్య ఇంటి కొనుగోలు శక్తి దాదాపు అన్ని నగరాల్లో పెరిగిందని తెలిపింది. ముంబైలో సూచీ భారీగా పెరిగిందని, కొనుగోలు శక్తి పెరుగుదలపరంగా కోల్కతా ముందు ఉందని తెలిపింది. కరోనా కారణంగా గత ఏఢాది అన్ని వర్గాల ప్రజల ఆదాయాలు తగ్గినప్పటికీ, ఈ ఏడాది కాస్త మెరుగుపడిందని తెలిపింది. అదే సమయంలో ఇళ్ల ధరలు గత ఏడాదితో పోలిస్తే అన్ని నగరాల్లోను దాదాపు పెరగలేదని, కేవలం హైదరాబాద్లో మాత్రమే పెరిగాయని తెలిపింది.
హైదరాబాద్లో అదుర్స్
దేశంలోని ఇతర ప్రముఖ రెసిడెన్షియల్ మార్కెట్లలో ఇళ్ల ధరలు స్తబ్ధుగా ఉన్నప్పటికీ, హైదరాబాద్లో ఆ పరిస్థితి కనిపించలేదని తెలిపింది. ఈ ఏడాది హైదరాబాద్లో ఇళ్ల కొనుగోలు శక్తి సూచీ 200 మార్కును దాటే అవకాశముందని జేఎల్ఎల్ అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే 193 నుండి 203కు పెరగవచ్చునని తెలిపింది.
దేశంలో ముంబై రియల్ మార్కెట్ను అత్యంత ఖరీదైనదిగా పేర్కొంది. JLL HPAI 2021 నివేదిక ప్రకారం ఇళ్ల కొనుగోలు శక్తిలో హైదరాబాద్ తర్వాత పుణే ఉంది. 100 మార్కు అంటే ఆ నగరంలో లోన్ కోసం ఎలిజిబుల్ ఆదాయం ఉన్నట్లు లెక్క. 100కు తక్కువగా ఉంటే హోమ్ లోన్ అర్హత కోసం సగటున తగినంత ఆదాయం లేదని అర్థం. 100కు పైగా ఉంటే హోమ్ లోన్ కోసం సగటు ఆదాయం కంటే ఎక్కువగా ఉందని అర్థం.
ఇలా కోల్కతా సగటు ఆదాయం 2020లో 201 నుండి 2018కి, హైదరాబాద్ 193 నుండి 203కు, పుణే 186 నుండి 196కు పెరుగుతుందని అంచనా వేశారు. బెంగళూరు 171 నుండి 191, చెన్నై 174 నుండి 185, ఢిల్లీ-ఎన్సీఆర్ 142 నుండి 143కు పెరుగుతుందని అంచనా. ముంబై 94 నుండి 100కు పెరుగుతుందని అంచనా.