గణాంకాలు చాలా కీలకం, కరోనా తర్వాత...: ఆర్బీఐ గవర్నర్
కరోనా మహమ్మారి కారణంగా అనిశ్చితులు ఏర్పడ్డాయని, లాక్ డౌన్ సహా వివిధ పరిణామాలు గణాంకాల లభ్యతకు సవాల్గా మారినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. భారత్ సహా పలు దేశాల్లో విధించిన లాక్ డౌన్ కారణంగా గణాంకాల లభ్యతకు సవాళ్లుగా మారినట్లు తెలిపారు. వివిధ దేశాలపై కరోనా ప్రభావం చూపిందని, ఇప్పటి వరకు చూడని సమస్యకు పరిష్కారాలను ప్రపంచం కనుగొనవలసి ఉందన్నారు.
2020 మార్చిలో కరోనా ఇబ్బందులు తలెత్తడంతో ఆ తొలి దశలో సీపీఐ గణాంకాలను ప్రచురితం చేసేందుకు గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ తీవ్ర ఇబ్బందులు పడిందన్నారు. కరోనా పరిణామాల్లో సరికొత్త గణాంక పద్ధతులను కనుగొనవలసి వచ్చిందని చెప్పారు. దీంతో దీర్ఘకాల ప్రయోజనాలు కలగనున్నట్లు తెలిపారు. సరికొత్త గణాంకాల తీరు వల్ల అధికారిక గణాంకాలకు కొత్త అవకాశం వచ్చిందన్నారు. డేటా గోప్యత, డేటా భద్రతకు మెరుగైన సమాచార నాణ్యత అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఆర్బీఐ ఎప్పుడు కూడా సమాచారాన్ని ప్రజల వస్తువుగా భావిస్తుందని తెలిపారు. ప్రజా విధానాలలో గణాంకాల ప్రాధాన్యతను సరిగ్గా అర్థం చేసుకోవాలన్నారు. కరోనా అనిశ్చితుల్లో మెరుగైన గణాంకాలే మంచిని చేయగలవన్నారు. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే సరైన గణాంకాలు అవసరమన్నారు. మార్కెట్ వర్గాల నుండి సరైన అంచనాలు వెలువడేందుకు మెరుగైన గణాంకాలు అత్యవసరమన్నారు.