విమానంలో పరికరాలు.. పెరగనున్న ఏసీ ధరలు! చైనా కాకుంటే తైవాన్..
కరోనా వైరస్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పుడు ఎండాకాలం వస్తోంది. ఈ సమయంలో మీరు ఏసీలు, ఫ్రిడ్జ్లు కొనుగోలు చేయాలనుకుంటే.. అదనంగా చెల్లించవలసి రావొచ్చు. ప్రతి ఏడాది వీటి ధరలు ఎండాకాలంలో పెరగడం సహజం. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా 5 శాతం నుండి 10 శాతం వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయని తెలిసిందే.
మార్కెట్లపై కరోనా వైరస్ ప్రభావం....
అందుకే అదనపు భారం
కంప్రయిజర్ కస్టం డ్యూటీని 5% వరకు పెంచడం, కరోనా వైరస్ కారణంగా లాజిస్టిక్కు అధిక ఖర్చు కానున్న నేపథ్యంలో ఏసీ ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ఏసీలను తయారు చేయడానికి ప్రధానంగా కంట్రోలర్స్, కంప్రయిజర్ సహా ఇతర విడిభాగాలపై చైనా, థాయ్లాండ్, మలేషియా దేశాల నుంచి దిగుమతి అవుతాయి. వీటిని విమానాల్లో తరలించాల్సి ఉండటంతో తయారీదారులపై అదనపు భారం పడనుందంటున్నారు.
ఈ ఖర్చుల వల్ల
లాజిస్టిక్ ఖర్చు అధికం కావడం, దీనికి తోడు కంప్రయిజర్లు, ఇతర విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని పెంచడంతో ధరలను తప్పనిసరిగా పెంచవలసిన అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. బ్లూస్టార్, గోద్రేజ్, పానాసోనిక్ సహా ఇతర సంస్థలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి.
మూతబడిన చైనా కంపెనీలు
కరోనా వైరస్ ప్రభావం కారణంగా చైనాలో కంపెనీలు మూతబడ్డాయి. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో.. కంప్రయిజర్లు, కంట్రోలర్లు, ఇతర విడిభాగాల దిగుమతులు ఎప్పుడు అవుతాయో తెలియని పరిస్థితి. ప్రతి సంవత్సరం ఏసీలు వేసవి కాలంలోనే 40 శాతం నుండి 45 శాతం అమ్ముడవుతాయి. ఈ వేసవిలో డిమాండ్కు తగినట్లుగా ఏసీలను మార్కెట్లోకి తీసుకు రావడంపై కంపెనీలు డైలమాలో ఉన్నాయి.
చైనాలో పరిస్థితులు సద్దుమణిగినా..
చైనాలో పరిస్థితులు ఇప్పుడు సద్దుమణిగినా విడిభాగాలు వెంటనే భారత్ వచ్చే పరిస్థితి లేదు. నౌకలలో తెప్పించడానికి కనీసం రెండు మూడు వారాల సమయం అవసరం. ఇంతలోనే వేసవి కాలం వస్తోంది. దీనిని అధిగమించేందుకు విమానాల్లో విడిభాగాలను తెప్పించుకోవడం మార్గంగా కనిపిస్తోంది. దీంతో రవాణా ఖర్చులు పెరిగి దేశీయ మార్కెట్లో ఏసీల ధరల్లో 3% నుంచి 5% వరకు పెంపు ఉండవచ్చు.
చైనా కాకుంటే తైవాన్
కరోనా వైరస్ గురించి ఆంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అసోచామ్ అంటోంది. కొన్ని ఔషధ ముడిపదార్ధాలు, విడిభాగాల్ని చైనా నుంచి తేలేని పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి లేదా దేశీయంగా ఉత్ప త్తి చేసుకోవచ్చనని తెలిపింది. స్వల్పకాలంలోను భారత్కు పెద్ద సవాల్ ఏమీ కాదని చెబుతోంది. చైనా నుండి కాకుంటే తైవాన్ నుంచి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు దిగుమతి చేసుకోవచ్చునని పేర్కొంటున్నారు.
ప్రభుత్వం సిద్ధం..
ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం తగ్గి.. చైనా నుండి ఎగుమతులు ప్రారంభమైతే వెంటనే క్లియరెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు మే నెలాఖరు వరకు రోజంతా అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు దేశంలోని రేవులు, ఎయిర్పోర్ట్స్ను కోరింది. అవసరమైతే అదనపు సిబ్బంది ఉండాలని ఆదేశించింది.