మైల్స్టోన్ బడ్జెట్: కొత్త ఉద్యోగాలపై సీఈవోలు ఏమన్నారంటే? ఆ ఖర్చులపై ఆందోళన
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ మైల్స్టోన్ వంటిది అని పలువురు సీఈవోలు సీఎన్బీసీ-టీవీ 18 సర్వేలో వెల్లడించారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 41 శాతం మంది సీఈవోలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా గాడిన పడిన భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందని, అంచనాలకు మించి రికవరీ కనిపిస్తోందని 48 శాతం మంది సీఈవోలు తెలిపారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు
రికవరీపై ఆశాజనకం
ఈ బడ్జెట్లో వెల్త్ ట్యాక్స్ ఉండే అవకాశముందని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటు సమస్యను తీర్చేందుకు మనం మరింత సమయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ బడ్జెట్లో ఒత్తిడిలో ఉన్న రంగాలు, సెక్టార్లకు ఊతమివ్వాలని సీఈవోలు అభిప్రాయపడ్డారు. 2021లో భారత ఆర్థిక వ్యవస్థపై సీఈవోలు తమ అభిప్రాయాలు మార్కుల రూపంలో తెలిపారు. భారత రికవరీపై పూర్తి శాతం (10 పాయింట్లు) ఆశాజనకంగా ఉన్నవారు 11 శాతంగా ఉన్నారు. 51 శాతం మంది 8 పాయింట్ల నుండి 9 పాయింట్లు, 29 శాతం మంది 6 పాయింట్ల నుండి 7 పాయింట్లు ఇచ్చారు. కేవలం 9 శాతం మంది సీఈవోలు మాత్రమే 5 పాయింట్ల కంటే దిగువ ఆశాజనకంగా ఉన్నారు.
సీఈవోలు ఏమన్నారంటే
ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో 1991 నుండి 1997 మాదిరి ఈ బడ్జెట్ కూడా మైలురాయి అవుతుందా అని ప్రశ్నించగా 41 శాతం సీఈవోలు అవునని చెప్పారు. 29 శాతం మంది మాత్రం అలా అనుకోలేమని తెలిపారు. ఆర్థిక రికవరీ ఊహించిన దాని కంటే వేగంగా పుంజుకుంటోందని 48 శాతం మంది చెప్పగా, అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు 36 శాతం మంది తెలిపారు.
డిమాండ్ క్రమంగా కరోనా ముందుస్థాయికి చేరుకుంటోందని 49 శాతం మంది అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది మాత్రం డిమాండ్ ఇంకా పుంజుకోలేదని తెలిపారు. వ్యాపారాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు 54 శాతం మంది సీఈవోలు చెప్పగా, 46 శాతం మంది సీఈవోలు మరో 6 నెలలు వేచి చూడాలన్నారు. నియామకాలు లేదా కొత్త ఉద్యోగాలపై 56 శాతం మంది వేచిచూసే ధోరణితో ఉన్నట్లు తెలిపారు. 38 శాతం మంది హైరింగ్ చేసుకోనున్నట్లు తెలిపారు. ఇన్పుట్ ఖర్చులు పెరుగుతాయని 55 శాతం మంది ఆందోళన వ్యక్తం చేయగా, 27 శాతం మంది డిమాండ్ గురించి ఆందోళన చెందారు. 18 శాతం మంది లిక్విడిటీ సమస్య ఉంటుందన్నారు.
ఎకనమిక్ పవర్ హౌస్ వరకు
స్వతంత్ర భారతావనిలోనే ఇప్పటి వరకు ఏ ఆర్థికమంత్రికి ఎదురుకాని అతి క్లిష్టమైన బడ్జెట్గా ఆర్థిక నిపుణులతో పాటు సీఈవోలు కూడా చెబుతున్నారు. నెవర్ బిఫోర్ బడ్జెట్ అంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ బడ్జెట్ 140 కోట్లమంది భారతీయుల ఆశలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ నినాదం అందుకున్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ బడ్జెట్ ఆత్మనిర్భర్ భారత్ నుండి ప్రపంచ ఎకనమిక్ పవర్ హౌస్కు తీసుకు వెళ్లేదిగా ఉండాలని భావిస్తున్నారు.