ఐపీవో నామ సంవత్సరం, ఆర్బీఐ తన వ్యాసంలో ఏం చెప్పిందంటే
ఈ 2021వ సంవత్సరం భారత్కు ఐపీవో నామ సంవత్సరంగా మారే అవకాశం ఉందని, దేశీయ యూనీకార్న్ సంస్థల పబ్లిక్ ఇష్యూలు స్టాక్ మార్కెట్లో పుంజుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాసం వెల్లడించింది. యూనీకార్న్ అంటే దాదాపు రూ.7500 కోట్ల వ్యాల్యూ కలిగిన సంస్థ. యూనికార్న్ సంస్థల పబ్లిక్ ఇష్యూలు దుమ్మురేపుతున్నాయని, అంతర్జాతీయ పెట్టుబడిదార్లు ఆసక్తి చూపుతున్నారని ఈ వ్యాసం తెలిపింది. కొద్ది నెలల్లో వరుసగా IPOలు విజయవంతం కావడం ద్వారా భారత టెక్నాలజీపై బుల్లిష్ వైఖరి చూపుతున్నట్లు తెలిపింది.
జొమాటో ఐపీఓకు 38 రెట్ల స్పందన రావడాన్ని ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, తయారీరంగ కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని, సేవల రంగం మెరుగుపడిందని, నగదు లభ్యత పరిస్థితులు సౌకర్యవంతంగా ఉన్నాయని ఆర్బీఐ వ్యాసం పేర్కొంది. కరోనా మహమ్మారి ఉధృతిని నియంత్రించేదుకు విధించిన ఆంక్షల సడలింపుతో డిమాండ్ పెరిగిందని పేర్కొంది.
సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని వెల్లడించింది. దేశంలో రుతుపవనాలు సాధారణంగా ఉన్నందున, వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నట్లు వెల్లడించింది. కరోనా ఆంక్షలు సడలించాక ప్రజల రాకపోకలు సెకండ్ వేవ్ ముందుస్థాయికి చేరుకున్నట్లు తెలిపింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర నేతృత్వంలోని బృందం ఈ వ్యాసాన్ని రచించింది.