రిటైల్ పెట్రోల్లో భారీ సంస్కరణ, వారికీ లైసెన్స్: కస్టమర్లకు ప్రయోజనం!
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీల మధ్య పోటీతత్వం పెంచేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పంపుల ఏర్పాటు విషయంలో పెట్రోల్ రిటైలింగ్ నిబంధనలను సడలించింది. నాన్ - ఆయిల్ కంపెనీలు సైతం వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చమురు రిటైలింగ్లో పెట్టుబడులు పెంపు, పోటీతత్వం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రవేటు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం గమనార్హం.
పండుగకు బంగారం కొనుగోలు చేస్తున్నారా?: ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఇప్పటి దాకా రూ.2వేల కోట్లు, ఇప్పుడు రూ.250 కోట్లు
ప్రస్తుతం ఫ్యూయల్ రిటైలింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ కంపెనీ రూ.2 వేల కోట్ల మేర హైడ్రోకార్బన్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్ లైన్స్ లేదా లిక్విడ్ నేచరల్ గ్యాస్ (LNG) టెర్మినల్స్ ఏర్పాటులో పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు అందులో మార్పులు చేశారు. తాజా నిర్ణయం నేపథ్యంలో రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు ఫ్యూయల్ రిటైలింగ్లోకి అడుగు పెట్టవచ్చు. అయితే ఇందులో 5 శాతం అవుట్ లెట్లను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలని షరతు విధించారు.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి..
లేదంటే రూ.3 కోట్ల జరిమానా ఉంటుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టిన అయిదేళ్లలోగా ఈ నిబంధనను అమలుపరచవలసి ఉంటుందన్నారు. అలాగే బంకులను ఏర్పాటు చేసిన మూడేళ్లలోగా CNG, LNG, బయో ఇంధనాలు లేదా విద్యుత్ వాహనాల చార్జింగ్ ఏదో ఒక స్టేషన్ను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఈ కొత్త విధానం వల్ల మరిన్ని పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయనుంది. అంతేకాకుండా ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు
రిటైల్ ఔట్లెట్లు పెరగడం వల్ల పోటీ అధికమై వినియోగదారులకు నాణ్యమైన సేవలు కూడా అందుతాయని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఈ రంగంలో మరింత పోటీ వల్ల వినియోగదారులు లాభపడుతారనే అభిప్రాయం వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2002లో చివరిసారి ఇంధన విక్రయ రంగంలో మార్పులు చేసింది. ఇప్పుడు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సిఫార్సులపై తాజా మార్పులు చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇంధన రిటైల్ రంగంలో సంస్కరణలు చేపట్టారు.
కంపెనీలకు పోటీ
ప్రభుత్వం తాజా నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ రిటైల్ రంగంలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు పోటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తుల రిటైల్ వ్యాపారంలో PSUలదే ఆధిపత్యం. రిలయన్స్, ఎస్సార్ వంటి కంపెనీలకు కొద్దిస్థాయిలో పంపులు ఉన్నప్పటికీ అవి నామమాత్రమే.
విదేశీ సంస్థలకు లైన్ క్లియర్
ప్రభుత్వ తాజా నిర్ణయంతో సౌదీ ఆరామ్కో, ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎస్ఏ, బ్రిటిష్ పెట్రోలియం, సింగపూర్ పూమా ఎనర్జీ వంటి అంతర్జాతీయ కంపెనీలు భారత పెట్రో ఉత్పత్తుల రిటైల్ మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రవేశిస్తాయని భావిస్తున్నారు. అదానీ గ్రూప్తో కలిసి దేశవ్యాప్తంగా 1500 పెట్రోల్ బంకులు తెరవాలని టోటల్ యోచిస్తోంది. గత ఏడాది లైసెన్స్కోసం దరఖాస్తు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో బ్రిటిష్ పెట్రోలియం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చూస్తోంది.
ఏ పెట్రోల్ బంకులు ఎన్ని అంటే...
ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ కంపెనీలు దేశంలో సుమారు 65వేల పెట్రోల్ పంపులు కలిగి ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, నైరా ఎనర్జీ, రాయల్ డచ్ షెల్ ప్రయివేటు కంపెనీలు కొన్ని పెట్రోల్ పంపులు నిర్వహిస్తున్నాయి. IOC, BPCL, HPCLలకు చెందిన 65 వేలకు పైగా పెట్రోల్ ఔట్ లెట్లు ఉన్నాయి. ఎస్సార్ ఆయిల్కు 5వేలకు పైగా, రిలయన్స్కు 1400కు పైగా, షెల్కు 160కి పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. IOCకి 27,981, HPCLకు 15,584, BPCLకు 15,708 ఉన్నాయి.
నిబంధనలు ఇవీ...
- కనీసం కంపెనీకి రూ.250 కోట్ల నికర ఆస్తులు ఉండాలి.
- అయిదేళ్లలో 5% పంపులు గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.
- నిబంధనల ప్రకారం లేకుంటే రూ.3 కోట్ల వరకు జరిమానా.
- లైసెన్స్ తీసుకునేటప్పుడే బంకుకు రూ.2 కోట్ల చొప్పున డిపాజిట్ చేసి ఈ గడువును పొడిగించుకోవచ్చు.
- పెట్రోల్, డీజిల్తో పాటు మూడేళ్లలో ప్రత్యామ్నాయ ఇంధనాలైన CNG, LNG, జీవ ఇంధనాల్లో ఏదో ఒకటి లేదా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.