ఆదాయపుపన్ను స్లాబ్: సర్ఛార్జ్ క్లోజ్? కేంద్రం-రాష్ట్రాలపై లక్షల కోట్ల భారం
ఆర్థిక మందగమనం కారణంగా ఉద్దీపన చర్యలు తీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్యాక్స్ స్లాబ్స్ల్లో మార్పులు చేసి ఆదాయపుపన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలిగించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను యాక్ట్ సమగ్రతపై వేసిన అఖిలేష్ రంజన్ టాస్క్ ఫోర్స్ కూడా పన్ను స్లాబుల్లో మార్పులను సిఫార్సు చేసింది.
కొత్త స్లాబ్స్ అమలైతే... రూ.2.5 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉంటే 10%, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఆదాయం ఉంటే 20%, రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల ఆదాయం ఉంటే 30%, రూ.2 కోట్ల ఆదాయానికి పైన ఉంటే 35% ట్యాక్స్ ఉండవచ్చు. ఈ మేరకు కమిటీ సిఫార్స్ చేసింది.
ఆదాయపు పన్ను శుభవార్త: వారికి రూ.7,00,000 బెనిఫిట్, ఏ స్లాబ్పై మీరు ఎంత ఆదా చేస్తారో తెలుసా?
సూపర్ రిచ్కు ఇది శుభవార్త
ఇది ఎక్కువగా సూపర్ రిచ్కు శుభవార్త అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మరో విషయం ఉంది. పన్ను సర్ ఛార్జీలను తాత్కాలిక చర్యలుగా మాత్రమే ఉపయోగించాలని సిఫార్సు చేసింది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2013లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం రూ.1 కోటి వరకు 10 శాతం సర్ఛార్జ్ విధించారు. అప్పుడు దానిని తాత్కాలిక సుంకం అని స్పష్టం చేశారు.
సర్ ఛార్జ్ అలా పెరుగుతూ వస్తోంది...
అయితే వరుస బడ్జెట్లలో సర్ ఛార్జీ అలా వస్తూ ఒక విధంగా శాశ్వతంగా అన్నట్లుగా మారిపోయింది. 2014లో నాటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీనిని పొడిగించారు. మరుసటి సంవత్సరం 12 శాతానికి పెంచారు. 2016లో రూ.50 లక్షల ఆదాయం కలిగిన వారికి 10 శాతం సర్ ఛార్జీని తీసుకు వచ్చారు. రూ.1 కోటికి పైగా ఆదాయం ఉంటే 15 శాతం సర్ ఛార్జ్ తెచ్చారు. ఇది అక్కడితో ఆగలేదు. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 25 శాతానికి, రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 37 శాతానికి పెంచారు. సర్ ఛార్జ్ ద్వారా ట్యాక్స్ పేయర్ ఎక్కువ మొత్తం చెల్లించవలసి వస్తోంది.
సూపర్ రిచ్కు భారీ ఊరట
రూ.6 కోట్ల నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ పైన రూ.2.53 కోట్లు లేదా 42 శాతం కంటే ఎక్కువ చెల్లించవలసి వస్తోంది. ఇందులో సర్ ఛార్జీ ఒక్కటే రూ.65 లక్షలుగా ఉంటుంది. వీటిని తొలగిస్తే అప్పుడు రూ.2.53 కోట్లకు బదులు రూ.1.97 కోట్లు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. అంటే 65 లక్షలకు పైగా ఆదా అవుతుంది. ఇది రిచ్ పీపుల్కు భారీ ఊరట.
సర్ఛార్జీతో దెబ్బతిన్నారు...
CBDT డేటా ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.5కోట్లకు పైగా ఆదాయం కలిగిన ట్యాక్స్ పేయర్స్ 2,850 మంది ఉన్నారు. సర్ ఛార్జ్ కారణంగా వీరు బాగా దెబ్బతిన్నారనే వాదనలు ఉన్నాయి. దీనిని తొలగిస్తే అది వారికి అతి పెద్ద ఊరట అవుతుంది.
ప్రభుత్వంపై కొత్త స్లాబ్స్ ప్రభావం
ఈ కొత్త స్లాబ్స్ అమలులోకి వస్తే ప్రభుత్వ ఖజానాపై భారీ ప్రభావమే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల రూ.1.45 లక్షల కోట్ల రెవెన్యూ తగ్గిందని అంచనా. బ్యాంక్ ఆప్ అమెరికా - మెరిల్ లించ్ నివేదిక ప్రకారం ఆదాయపు పన్ను స్లాబ్స్ తగ్గింపు వల్ల ప్రభుత్వంరై రూ.1.75 లక్షల కోట్ల భారం పడనుంది. ఇందులో రూ.1 లక్ష కోట్ల రూపాయలు కేంద్రంపై, రూ.75,000 కోట్ల రూపాయల భారం రాష్ట్రాలపై పడనుంది.