ఈఫీఎఫ్ఓ దీపావళి గుడ్న్యూస్: ఖాతాల్లోకి పెరిగిన వడ్డీ రేట్లు, అలా మీకు నష్టం!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందిస్తోంది. పీఎఫ్ అకౌంట్ హోల్డర్ల ఖాతాల్లోకి వడ్డీని జమ చేస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పలువురు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఇప్పటికే 8.65 శాతం వడ్డీ రేటును పొందారు. అందరి అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమ చేస్తోంది. ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్స్ ఖాతాల్లో పడే మొత్తం రూ.54,000 కోట్లు... ఈ భారం కేంద్రంపై పడుతోంది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెంచిన నేపథ్యంలో అందరి ఖాతాల్లో పడే మొత్తం రూ.54,000 కోట్లుగా ఉంటుంది. అంతకుముందు ఏడాది కంటే మీరు అందుకుంటున్న వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు అదనం. ఈపీఎఫ్ఓ మొత్తం కార్పస్ రూ.11 లక్షలకోట్లకు పైగా ఉంది.
పీఎఫ్ చెక్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు...
ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్, మిస్డ్ కాల్స్, ఎస్సెమ్మెస్ సర్వీస్ల రూపంలో చెక్ చేసుకోవచ్చు. మొదటి రెండింటి ద్వారా మీ పీఎఫ్ పాస్బుక్ వివరాలు మొత్తం కనిపిస్తాయి. అలాగే ఎంత వడ్డీ మీ అకౌంట్లో జమ అయిందో కూడా తెలుసుకోవచ్చు.
మీ పాస్ బుక్ డిటైల్స్ ఇలా తెలుసుకోవచ్చు
మీ మొబైల్లో ఉమాంగ్ యాప్ ఉంటే ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్లోకి వెళ్లి వ్యూ పాస్బుక్ ఆప్షన్ ఎంచుకోవాలి. యూఏఎన్, ఓటీపీ సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. అప్పుడు ఈపీఎఫ్ పాస్బుక్ కనిపిస్తుంది.
లేదా ఈఫీఎఫ్ఓ సైట్లోకి వెళ్ళి, యూఏఎన్, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ కావాలి. వ్యూ పాస్ బుక్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మీ డిపాజిట్, విత్ డ్రాలకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి. పాస్బుక్ డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.
అలాగే, 7738299899 ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లేదా 011-22901406 మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. అయిత ఇలా కేవలం అమౌంట్ మాత్రమే కనిపిస్తుంది.
అక్టోబర్ 7వ తేదీ నుంచి కాంపౌండింగ్
కార్మిక మంత్రిత్వ శాఖ వడ్డీ రేటును ఫిబ్రవరిలో ప్రకటించినప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఆలస్యం కారణంగా వడ్డీ రేటు జమకు సమయం పట్టింది. దీంతో గత ఏడాది వడ్డీపై చక్ర వడ్డీ లభించలేదు. అంటే అక్టోబర్ 7న వడ్డీ జమ అయినందున గత ఏడాది వడ్డీపై ఎటువంటి చక్ర వడ్డీని పొందలేదు. అక్టోబర్ 7వ తేదీ నుంచి కాంపౌండింగ్ ప్రారంభమవుతుంది.