లేదంటే హైదరాబాద్, చెన్నై వెళ్లిపోతారు: మోడీకి జగన్ 'లెక్కలు'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. వీరిద్దరు దాదాపు గంటన్నరసేపు వివిధ అంశాలపై చర్చించారు. అక్టోబర్ 15వ తేదీన ప్రారంభించనున్న రైతు భరోసా కార్యక్రమానికి రావాలని ప్రధానిని కోరారు. అయితే వివిధ కారణాల వల్ల మోడీ రాకపోవచ్చునని కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా ఏపీకి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నవరత్నాలకు, నదుల అనుసంధానానికి సహకరించాలన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ను వల్ల పెద్దఎత్తున ఆదా చేశామని, సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరారు.
గ్రాంట్ ఎయిడ్ రూపంలో రూ.61,071 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి గ్రాంట్ ఎయిడ్ రూపంలో రూ.61,072 కోట్లు అవసరమని, కానీ రూ.6,740 మాత్రమే విడుదల చేసిందని మోడీకి జగన్ విజ్ఞప్తి చేశారు. రూ.50,000 కోట్ల వరకు వివిధ బిల్స్ పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కోరారు. ఇది పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. పర్ క్యాపిడా రూ.1.46 లక్షల నుంచి రూ.1.29 లక్షలకు తగ్గిందన్నారు.
వారికి రూ.4000, మాకు రూ.400
రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం రూ.18,970 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. విభజన నుంచి (2014-15) ఇప్పటి వరకు రూ.22స948 కోట్ల లోటు బడ్జెట్కు బదులు రూ.3,979 మాత్రమే కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. వెనుకబడిన బుందేల్ ఖండ్, కలహండి జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చారని, ఆయా జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.4వేలు కేటాయించగా ఏపీకి రూ.400 మాత్రమే కేటాయించారన్నారు. ఏపీలోని జిల్లాలకు దానిని వర్తింప చేయాలని కోరారు. ఈ ఆరేళ్లలో రూ.2100 కోట్లు రావాల్సి ఉండగా రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.
పోలవరం రివర్స్ ద్వారా ఆదా
పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేశామన్నారు. హెడ్ వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పనుల మొత్తం రూ.780 కోట్లు కాగా, టన్నెల్ పనులకు సంబంధించిన రూ.58 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. సవరించిన అంచనాలు (రూ.55,548 కోట్లు) ఆమోదించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం సొంత నిధులు రూ.5,103 కోట్లను దీని కోసం ఖర్చు చేసిందని, ఆ నిధుల్ని తక్షణమే రీయింబర్స్ చేయాలని కోరారు. ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యేందుకు మరో రూ.16వేల కోట్లు విడుదల చేయాలన్నారు. ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు.
రాయితీలివ్వకుంటే హైదరాబాద్, చెన్నై వెళ్తారు
విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్ర స్థూల ఆదాయం తగ్గిందని, జీవీఏ 76.2 శాతం నుంచి 68.2 శాతానికి పడిపోయిందని, తలసరి ఆదాయం రూ.1.46 లక్షల నుంచి రూ.1.29 లక్షలకు పడిపోయిందన్నారు. మార్పు రావాలంటే హోదా అవసరమన్నారు. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వకుంటే పెట్టుబడిదారులు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు వెళ్తారన్నారు.
నవరత్నాలకు సహకరించండి...
ఏపీలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నవరత్నాల పథకాలు ప్రకటించామని, వీటికి చేయూతనివ్వాలని ప్రధాని మోడీని జగన్ కోరారు. నవరత్నాల్లో... రైతు కోసం రైతు భరోసా, అందరికీ విద్య కోసం అమ్మ ఒడి, విద్యా దీవెన, అందరికీ ఆరోగ్యం కోసం ఆరోగ్య శ్రీ, పేదలందరికీ ఇళ్లు, ఈ సంవత్సరమే ఇళ్ల స్థలాల పంపిణీ, పెన్షన్స్ పెంపు, మహిళా సాధికారత కోసం ఆసరా, నిరాదరణకు గురవుతున్న వారికి చేయూత , సాగునీటి వనరుల పెంపు.. వంటివి అమలు చేస్తున్నామన్నారు.
ఏపీ ఇచ్చే రూ.12500ల్లో కేంద్రం నిధులు సగం
అక్టోబర్ 15న నెల్లూరులో రైతు భరోసా పథకం ప్రారంభిస్తున్నామని, దీంతో రాష్ట్రంలోని కౌలు రైతులు సహా 53 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని, ఈ పథకం ప్రారంభోత్సవానికి రావాలని జగన్ కోరారు. రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం రూ.12,500 ఇస్తోంది. ఇందులో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.6,000 ఇస్తుండగా, జగన్ ప్రభుత్వం రూ.6500 aకలిపి రూ.12,500 ఇస్తోంది. అక్టోబర్ 15న లాంచ్ చేసే రైతు బంధు కార్యక్రమానికి ప్రధాని మోడీ వస్తే బావుండదని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (రూ.6000) కలిపి ఇస్తూ ఏపీ ప్రభుత్వం తన అకౌంట్లో వేసుకుంటోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మోడీ వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు.