మోడీ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్: ఉద్యోగులకు వేతనం పెంపు, ఆదాయపన్ను స్లాబ్ మార్పు
న్యూఢిల్లీ: ఇటీవల కార్పోరేట్లకు కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్ధీపనలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయంతో మన దేశంలోనూ కొనుగోలు శక్తి తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో వాహన సేల్స్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలను ప్రోత్సహించేందుకు వరుసగా కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరట ప్రకటనలు చేశారు. చిరు వ్యాపారులకు కూడా జీఎస్టీ వంటి అంశాలపై ఊరట కల్పించారు. పర్యాటక రంగ ప్రోత్సాహానికి హోటళ్ల జీఎస్టీని తగ్గించారు. అలాగే కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు సామాన్యులకు కూడా ఊరట కల్పించే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని అంటున్నారు.
మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీని చూసుకోవడం ఎలా?
5 శాతం మేర ఊరట...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనుంచి పన్ను చెల్లింపుదారుల వరకు అందరికీ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుందట. ఏడో వేతన సంఘ సిఫార్సు మేరకు జీతాల పెంపు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి కొంత ఊరట కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందట. కార్పోరేట్ పన్ను తగ్గింపు అనంతరం వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లపై దృష్టి సారించింది కేంద్రం. ముఖ్యంగా ఈ రేట్లను హేతుబద్దీకరించి మిడిల్ క్లాస్ వినిమయ శక్తిని పెంచి, వినిమయ మార్కెట్లో ఉత్తేజం తేవాలని భావిస్తోంది. పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఐదు శాతం మేర లబ్ధి చేకూర్చాలని భావిస్తోందట.
స్లాబ్ తగ్గింపు
రూ.5 లక్షల - రూ.10 లక్షల ఆదాయం కలిగినవారికి ఇకపై 10 శాతం పన్ను రేటును అమల్లోకి తేవాలనే ప్రతిపాదన ఉంది. ఈ స్లాబ్లోని వారు 20 శాతం పన్ను స్లాబ్లో ఉన్నారు. అలాగే, హయ్యెస్ట్ స్లాబ్ రేట్ 30 శాతంగా ఉండగా దీనిని స్లాబుని 25 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు.
మిడిల్ క్లాస్ చేతికి సొమ్ము...
రూ.5 నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయ వర్గానికి సగానికి సగం పన్ను తగ్గింపు ద్వారా ముఖ్యంగా మధ్య తరగతి చేతిలోకి మరింత సొమ్ము అందుబాటులోకి వచ్చేలా చేయాలనేది కేంద్రం యోచన. ఆదాయపు పన్నుపై సెస్, సర్చార్జ్ల్ని పూర్తిగా ఎత్తివేసే ఆలోచన చేస్తున్నారట.
సంపన్నుల కోసం 35 శాతం స్లాబ్
ప్రత్యక్ష పన్నుల కోడ్పై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ ఆగస్ట్ నెలలో తన నివేదికని అందించింది. మరోవైపు, రూ.2 కోట్లు లేదా అంతకుపైబడి వార్షిక ఆదాయం ఉన్న సంపన్నుల కోసం కొత్తగా 35 శాతం పన్ను స్లాబును అమలులోకి తేవాలని కూడా యోచిస్తోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గరిష్ట స్లాబ్ 30 శాతమే.
రూ.5 లక్షల వరకు నో ట్యాక్స్
ప్రస్తుతం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారిపై 5 శాతం ట్యాక్స్ ఉంది. దీనిని సున్నా చేయనున్నారు. రూ.5 లక్షల ఆదాయం వరకు ఆదాయ పన్నును చెల్లించక్కరలేని విధంగా టాస్క్ ఫోర్స్ సిఫార్స్ చేసింది. అయితే రాయితీల ద్వారా రూ.5 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను లేకుండా ప్రభుత్వం గత బడ్జెట్లోనే ప్రకటన చేసింది.
కనీస వేతనం రూ.26వేల డిమాండ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘ సిఫార్సులకు అనుగుణంగా జీతాల పెంపుపై దసరాకు ముందే కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కనీస వేతనాల్ని కనీసం రూ.8 వేల మేర పెంచాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేలు. జీతాల పెంపుపై కేంద్రం పండుగకు నిర్ణయం ప్రకటిస్తే అది 26 వేలకు చేరవచ్చు.