అనిల్ అంబానీకి వాటాదారుల బెదిరింపులు, కేసు వేస్తామన్న షేర్ హోల్డర్లు
రిలయన్స్ అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చుక్కెదురైంది. పేలవమైన మానేజ్మెంట్ వల్ల కంపెనీ సంపద హరించుకు పోయిందని, తద్వారా తాము భారీగా నష్టపోయామని గ్రూప్ కంపెనీల వాటాదారులు ఆందోళన వ్యక్తం చేసారు. యాజమాన్యానికి వ్యక్తికంగా తాము ఉమ్మడిగా కేసు (క్లాస్ ఆక్షన్ సూట్) దాఖలు చేస్తామని బెదిరించారు. ఈ సంఘటన సోమవారం జరిగిన రిలయన్స్ పవర్ కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) లో జరిగింది.
ఒక వాటా దారుడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు. రెండు నెలల్లో తమ డిమాండ్లను నెరవేర్చక పోతే, దేశంలోనే మొట్ట మొదటి క్లాస్ ఆక్షన్ సూట్ దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. వృత్తి రీత్యా కార్పొరేట్ లాయర్ ఐన సదరు వ్యక్తి రిలయన్స్ అడాగ్ గ్రూప్ లోని 7 కంపెనీల్లో దాదాపు రూ 3 కోట్ల పెట్టుబడి పెడితే, ఇప్పుడు అది కాస్తా 90% తరిగిపోయిందని ఆరోపించారు. అదే సమయంలో కంపెనీని నడిపిస్తున్న అనిల్ అంబానీ తనకు చెందిన 80% వాటాలను తనఖా పెట్టడం అయన సమర్థను ప్రశ్నర్థకం చేస్తోందని టార్గెట్ చేసారు. ఈ విషయాన్నీ ప్రముఖ వార్త ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) వెల్లడించింది.
అనిల్ అంబానీ సంచలన నిర్ణయం, రుణ వ్యాపారానికి గుడ్బై
10% వాటాదారులు..
అభివృద్ధి చెందిన దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో క్లాస్ ఆక్షన్ సూట్ వేయడం సర్వ సాధారణం. ఒక కంపెనీ ఉత్పత్తి లేదా సేవల వల్ల ఎక్కువ మంది వినియోగదారులు ప్రభావితం అయితే, అందులో మెజారిటీ వినియోగదారులు కలిసి ఉమ్మడిగా ఆయా కంపెనీలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తారు. చాలా సందర్భాల్లో వారు కంపెనీలపై గెలిచారు కూడా. కానీ ఇప్పటివరకు భారత్ లో ఇలాంటి కేసు దాఖలు కాలేదు. అయితే, తాను ఆవరసరమైతే, రిలయన్స్ అడాగ్ కంపెనీలోని 10% వాటాదారులను ఏకం చేసి క్లాస్ ఆక్షన్ సూట్ దాఖలు చేస్తానని సదరు కార్పొరేట్ లాయర్ ఐన వాటాదారు అనిల్ అంబానీని బెదిరించారు.
కొత్త కంపెనీల చట్టం ప్రకారం...
భారత ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త కంపెనీల చట్టం (ది కంపెనీస్ ఆక్ట్, 2013) లోని ఒక సెక్షన్.. క్లాస్ ఆక్షన్ సూట్ దాఖలు చేసేందుకు వీలు కల్పిస్తోంది. అయితే, కొత్త కంపెనీల చట్టం అమల్లోకి వచ్చి 5 ఏళ్లకు పైగా అవుతున్నా.. ఇప్పటివరకు ఈ సెక్షన్ ను ఎవరూ ఉపయోగించుకోలేదు. ఒక వేళ ఆ వాటాదారుడు బెదిరించడమే కాకుండా నిజంగానే రంగంలోకి దిగితే మాత్రం భారత్ లో ఇదే తోలి క్లాస్ ఆక్షన్ సూట్ కానుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పడిపోయిన గ్రూప్ కంపెనీల విలువ ...
అన్నదమ్ములు ఇద్దరు విడిపోయినప్పుడు రిలయన్స్ గ్రూప్ విలువ సుమారు లక్ష కోట్లు. ఆ తర్వాత అనిల్ సారధ్యంలోని రిలయన్స్ అడాగ్ గ్రూప్ కంపెనీల సంయుక్త విలువ రూ లక్ష కోట్లు దాటింది. కానీ ప్రస్తుతం ఈ గ్రూప్ అన్ని కంపెనీల మార్కెట్ విలువ కేవలం రూ 18,525 కోట్లకు పడిపోయింది. ఇందులో రిలయన్స్ నిప్పాన్ ఏఎంసీ ఒక్క కంపెనీ విలువే రూ 16,000 కోట్లుగా ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ విలువు రూ 212 కోట్లుగా ఉంది. 2008 లో 72 రేట్లు అధిక బిడ్లు లభించి మార్కెట్ నుంచి రూ 11,563 కోట్లు సమీకరించిన రిలయన్స్ పవర్ ప్రస్తుత విలువ రూ 617 కోట్లకు పడిపోయింది.
ఓపిగ్గా విన్న అనిల్ అంబానీ ...
ఒక వైపు కంపెనీ వాటాదారుడు ఉద్రేకంగా మాట్లాడుతూ మానేజ్మెంట్ ను దుయ్యబడుతుండగా... సమావేశంలో వేదికపైనే ఉన్న గ్రూప్ అధినేత అనిల్ అంబానీ మాత్రం చాలా ఓపికగా అయన ప్రసంగాన్ని విన్నారు. 15 నిమిషాలకు పైగా సాగిన వాటాదారుని ప్రసంగాన్ని మరికొంత మంది వాటాదారులు అడ్డుకొనే ప్రయత్నం చేసినా ... అనిల్ అంబానీ మాత్రం అతన్ని మాట్లాడేందుకు అనుమతించటం గమనార్హం. ఒకవైపు కంపెనీలో రూ 15,300 కోట్ల నిధులు ఉన్నట్లు చూపుతూనే, మరో వైపు రుణాలపై 13.9% వడ్డీ ని చెల్లిస్తుండటాన్నివాటాదారులు ప్రశ్నించారు. ఇప్పటికైనా రిలయన్స్ గ్రూప్ కంపెనీల భవితవ్యంపై అనిల్ అంబానీ స్పష్టమైన ప్రకటన చేయాలనీ, కంపెనీలో పారదర్శకతను తీసుకురావాలని మరికొంత మంది వాటాదారులు డిమాండ్ చేసారు.