కార్లు సరే... మరి వీటి సంగతేంటి మేడం? మాంద్యాన్ని గుర్తించకపోతే మొదటికే మోసం
భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల కార్ల అమ్మకాలపై చేసిన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓలా , ఉబెర్ ల వల్ల లక్షాధికారులు (మిల్లీనియల్స్) కొత్త కార్లు కొనుగోలు చేయటం లేదని, ఇది కార్ల అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆమె సెలవిచ్చారు. ఈ వ్యాఖ్యలను ఆటో పరిశ్రమ తిరస్కరించింది. అయితే, అసలు విషయం ఏమిటంటే... భారత్ ప్రస్తుతం తీవ్రతరమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోందన్న విషయాన్నీ అటు ప్రభుత్వం కానీ... ఇటు సాక్షాత్తు ఆర్థిక మంత్రి కానీ గుర్తించేందుకు ఇష్టపడటం లేదు. అందుకే, ఆవిడ ఆటోమొబైల్ సంక్షోభం ఓలా , ఉబెర్ ల పైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమ్మతం కాదు. ఆర్థిక మంత్రి వాదం తప్పు అని గణాంకాలతో ఇప్పటికే మీడియా నిరూపించింది కూడా. అయినా... అమ్మకాల ఒత్తిడి కేవలం ఆటోమొబైల్ రంగానికే పరిమితం కాలేదన్న విషయాన్నీ కూడా మన ఆర్థిక మంత్రి గుర్తించక పోవడం శోచనీయం.
నిర్మలా సీతారామన్కు షాకిచ్చిన మారుతీ
అవి ఎందుకు తగ్గుతున్నట్లు?
కార్ల అమ్మకాలు తగ్గేందుకు ఒక వేళ ఆర్థిక మంత్రి చెప్పిందే నిజమని అనుకొందాం. మరెప్పుడు ద్వి చక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు కూడా ఎందుకు తగ్గు తున్నట్లో నిర్మల సీతారామన్ చెబితే బాగుటుందని ఆటోమొబైల్ రంగంలోని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్లు (సియాం) ఆగష్టు నెల గణాంకాల ప్రకారం కార్ల అమ్మకాలు 41% తగ్గి 1,15,957 కు పడిపోతే, వాణిజ్య వాహనాల అమ్మకాలు 39% పతనమై 51,897కు పరిమితమయ్యాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22% క్షీణించాయి. ఈ విషయాన్నీ ప్రభుత్వం, అలాగే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గుర్తించాల్సి ఉంది. ఇది కేవలం ఒక నీలో, రెండు నెలలో అయితే ఫరవాలేదు. దాదాపు ఏడాది కాలంగా అమ్మకాలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఐన... తమకేమి పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరించటం గమనార్హం.
తీవ్ర నిర్ణయాలు...
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని ప్రధాన విధానాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకొంటోంది. నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. పన్ను సంస్కరణల రూపేణా ఆఘమేఘాలపై ప్రజలపై రుద్దిన జీఎస్టీ తో అది మరింత తీవ్ర రూపం దాల్చింది. వేళా కోట్లు ఎగొట్టే బడా బాబులను ఏమి చేయలేని ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమోసాలు, కచోరీలు అమ్మి పొట్ట పోసుకొనే వీధి వ్యాపారులపై తమ ప్రతాపం చూపుతోంది. రోజులకు రోజులు రెక్కీలు నిర్వహించి మరీ కచోరి వ్యాపారం సాలీనా రూ 50 లక్షలు దాటింది కాబట్టి పన్ను కట్టాలని వేధిస్తోంది. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల వేళా కొద్దీ చిన్న వ్యాపారాలు, స్టార్టుప్ కంపెనీలు మూత పడ్డాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. అయితే, వీటిపై సరైన గణాంకాలు రికార్డు కావు కాబట్టి వెలుగు లోకి రావట్లేదు. అదే ఆటోమొబైల్ రంగం ఎప్పటికప్పుడు అమ్మకాలను అధికారికంగా సేకరిస్తోంది కాబట్టి ఆ రంగంలో ఏం జరుగుతోందో అందరి తెలుస్తోంది.
సబ్బులు, షాంపూలు, బిస్కెట్లు ...
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గ్రామీణ, పట్టణ మార్కెట్ల లోనూ షాంపూలు, సబ్బులు, బిస్కెట్ల విక్రయాలు కూడా తగ్గుతున్నాయి. బిస్కెట్లు తయారు చేసి పేరు మోసిన ఒక కంపెనీ అమ్మకాలు తగ్గటం వల్ల 10,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇవన్నీదేశంలో ఆర్థిక మాంద్యం నెలకొంది అన్న దానికి నిదర్శనాలు. అయినా... మేం అంగీకరించం, మేం గుర్తించం... ఇదంతా 60 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకమే అంటే... ఇక దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరగా సమస్యకు పరిస్కారం చూపక పోతే, దేశం మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవటం ఖాయం అని వారు అభిప్రాయపడుతున్నారు.
అమల్లో కనిపించని శ్రద్ధ ...
తోలి సారి ఆర్థక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మల సీతారామన్... దాదాపు అన్ని వర్గాలను సంతృప్తి పరిచే నిర్ణయాలు తీసుకొన్నారు. దీర్ఘకాలిక లక్షలను సాధించే విధంగా బడ్జెట్ ప్రణాళిక కనిపించింది. కానీ సంపన్నులపై అధిక పన్ను భారం వేయటంతో ఆ వర్గం గుర్రుగా ఉంది. దాని ప్రభావం సంస్థాగత పెట్టుబడులపై పడింది. అందుకే, ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో రూ 14 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడులు హారతి కర్పూరమయ్యాయి. దీంతో అధికంగా నష్టపోయింది రిటైల్ ఇన్వెస్టర్లే. మౌలిక వసతుల కల్పనపై అధిక పెట్టుబడులు పెడతామని ప్రకటించినా... ఇప్పటి వరకు అమ్మల్లో ఒక్క అడుగు ముందుకు పడక పోవడం ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని సూచిస్తోంది. కేవలం దేశ భద్రత పేరుతో ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే ... తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఉద్దీపన చర్యలను వేగవంతం చేయాలనీ వారు హితవు పలుకుతున్నారు.