స్మార్ట్ టీవీల మార్కెట్లో మొబైల్ ఫోన్ కంపెనీల హవా...
దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను దున్నేస్తున్న మొబైల్ ఫోన్ల కంపెనీలు ఇప్పుడు స్మార్ట్ టీవీల మార్కెట్ పై దృష్టి సారిస్తున్నాయి. ఈ మార్కెట్లో అపార అవకాశాలు ఉన్న నేపథ్యంలో కొత్తగా మరిన్ని కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నాయి. వివిధ రకాల వీడియోలు చూసే వారితో పాటు వీడియో గేమ్స్ అడే వారు, విభిన్న రకాల యాప్ లను వినియోగించే వారు పెరిగిపోతున్నారు. ఈనేపథ్యంలో ఇందుకు అనుగుణమైన స్మార్ట్ టీవీలను అందుబాటు ధరల్లోనే కంపెనీలు తీసుకువస్తున్నాయి. ఫలితంగా రానున్న కాలంలో టీవీల మార్కెట్లో పోటీ మరింతగా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?
50 కోట్లకు వీడియో ప్రేక్షకులు
* మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం జోరుగా పెరుగుతోంది. రిలయన్స్ ప్రవేశంతో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరగడానికి దారితీస్తోంది. మన దేశంలో ఏటా 4 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుగా మారుతున్నట్టు అంచనా. 2020 నాటికీ ఆన్ లైన్ వీడియో ప్రేక్షకుల సంఖ్య 50 కోట్లకు చేరుకుంటుందని గూగుల్ అంచనా వేస్తోంది.
* రిలయన్స్ జియో ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా వీడియో, ఇతర రకాల కంటెంట్ బాగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
* ఇప్పటికే జియోకు 30 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. జియో ఫైబర్ తో వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా.
స్మార్ట్ టీవీల్లో ఓటీటీ యాప్స్
* స్మార్ట్ టీవీల్లో ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. అంటే ఇవి కంప్యూటర్ మాదిరిగానే పనిచేస్తాయన్నమాట. ఫలితంగా టీవీల్లో వీడియో యాప్స్, గేమ్స్, ఇతర సర్వీసులను వినియోగించుకోవచ్చు. వీటిలో ముందుగానే ఇంస్టాల్ చేసిన ఓటీటీ యాప్స్ ఉంటాయి. వీటి ద్వారా వీడియో లు వీక్షించవచ్చు. వీటి ద్వారా టీవీల కంపెనీలకు కూడా ఆదాయం వస్తుంది. అందుకే వీడియో సర్వీసులు అందిస్తున్న కంపెనీలతో టీవీల కంపెనీలు జట్టుకడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ తో పాటు హాట్ స్టార్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) యాప్స్ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.
* ఇప్పటికే మొబైల్ ఫోన్ల కంపెనీలు వివిధ రకాల కంపెనీలతో చేతులు కలపడం వల్ల వాటి యాప్ లు మన మొబైల్ ఫోన్లలో మనం ఇంస్టాల్ చేయకుండానే ప్రత్యక్షం అవుతున్న విషయం తెలిసిందే. వీటిని వినియోగిచుకోవడం వల్ల అటు మొబైల్ కంపెనీకి, ఇటు యాప్ కంపెనీకి రాబడి వస్తుంది.
ఈ కంపెనీలదే జోరు...
* ఆన్ లైన్ మార్కెట్ ద్వారా చైనాకు చెందిన షామీ భారత మొబైల్ ఫోన్ ప్రవేశించింది. ఊహించని విధంగా ఈ కంపెనీ సక్సెస్ అయింది. ఇప్పుడు స్మార్ట్ టీవీల మార్కెట్లోనూ సత్తా చాటుకుంటోంది.
* చైనాకు చెందిన మరో కంపెనీ వన్ ప్లస్ కూడా త్వరలోనే స్మార్ట్ టీవీలను విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతోంది.
*దేశీయ కంపెనీ మైక్రో మాక్స్ కూడా స్మార్ట్ టీవీలు తెస్తోంది.
* ఇప్పటిదాకా సోనీ, ఎల్జీ, శాంసంగ్, పానాసోనిక్ వంటి కంపెనీలదే టీవీల మార్కెట్లో అధిక వాటా ఉండేది. కానీ ఇప్పుడు ఈ కంపెనీలకు పోటీగా మరిన్ని కంపెనీలు ప్రవేశిస్తుండటంతో పోటీ ఇంకా పెరగనుంది.
ధరలు దిగొస్తాయ్...
* కంపెనీల మధ్య పోటీకారణంగా స్మార్ట్ టీవీల ధరలు మరింతగా తగ్గడానికి అవకాశం ఏర్పడనుంది. ఇప్పటికే కంపెనీలు తక్కువ ధరల్లోనే ఈ టీవీలను అందుబాటులోకి తెచ్చాయి.
* షామీ గత ఏడాదిలో స్మార్ట్ టీవీల మార్కెట్లోకి ప్రవేశించింది. ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4 ను రూ. 39,999 ధరకు అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత చవక ధరల్లో టీవీలను తెచ్చింది. 32 అంగుళాల టీవీని రూ. 12,999 ధరలో తెచ్చింది. ఇప్పటికే 20 లక్షలకు పైగా ఎంఐ టీవీలను విక్రయించినట్టు కంపెనీ చెబుతోంది.
* మైక్రో మాక్స్ ఇప్పటికే టీవీలను విక్రయిస్తోంది. ఆండ్రాయిడ్ ఓ ఎస్ తో కూడిన టీవీలను ఈ కంపెనీ విడుదల చేసే సన్నాహాల్లో ఉంది.