300ఏళ్ల తర్వాత తొలిసారి నమ్మకం ఏర్పడింది: నారాయణమూర్తి
గోరక్పూర్: దేశంలో పేదరికాన్ని నిర్మూలించగలమనే విశ్వాసం, ఆశలు నింపే ఆర్థిక వాతావరణాన్ని కలిగి ఉండటం మన దేశంలో 300 ఏళ్ల తర్వాత తొలిసారి చూస్తున్నామని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి గురువారం నాడు అన్నారు. గోరక్పూర్ (యూపీ)లోని మదన్ మోహన్ మాలవియా యూనివర్సిటీ ఆప్ టెక్నాలజీ (MMMUT)లో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

300 ఏళ్ల తర్వాత మొటిసారి విశ్వాసం..
పేదరికాన్ని నిర్మూలించగలమని, ప్రతి భారతీయుడికి మంచి భవిష్యత్తు సృష్టించగలమనే విశ్వాసం కలిగించే వాతావరణం 300 ఏళ్ల తర్వాత మొదటిసారి ఏర్పడిందని నారాయణమూర్తి అన్నారు. మనం గట్టిగా ప్రయత్నాలు చేస్తే కడు పేదరికంలోని పిల్లల కన్నీళ్లు తుడవగలమని చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్నది కూడా ఇదే అన్నారు. ఈ స్నాతకోత్సవంలో యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, MMMUT వైస్ ఛాన్సులర్ నివాస్ సింగ్, యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు, వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.

మేరా భారత్ మహాన్ అంటే దేశభక్తి చాటటం సులభం కానీ..
జాతీయ జెండాను పట్టుకొని మేరా భారత్ మహాన్, జయహో అని నినాదాలు చేయడం చాలా సులభమని, కానీ విలువలు పాటించడం మాత్రం చాలా కష్టమని నారాయణమూర్తి అన్నారు. ఈ దేశం కోసం ప్రతి పౌరుడు తనకు తోచిన ఉత్తమ సేవలు అందించడమే అసలు దేశభక్తి అన్నారు. దేశం కోసం పని చేయడమే దేశభక్తి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి దేశంకోసం పని చేయాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ దేశభక్తే
మనం మన వ్యక్తిగత ఆసక్తులను, ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశ కోసం పని చేయగలగాలని నారాయణమూర్తి అన్నారు. దేశం కోసం ఈర్షా, ద్వేషాలను పక్కన పెట్టాలన్నారు. సామాజిక శ్రేయస్సు కోసం వివిధ రంగాల్లో ఉత్సాహంతో, చిత్తశుద్ధితో పని చేయడం కూడా దేశభక్తే అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
మనం నిరంతరం మనకంటే మెరుగైన దేశాలతో పోల్చుకోవడంతో పాటు వాటి నుంచి నేర్చుకోవాలని నారాయణమూర్తి అన్నారు. ఉదాసీనతను పక్కన పెట్టి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు.


Click it and Unblock the Notifications