ఒకప్పుడు ప్రపంచంలో టాప్ సేల్స్, ఇప్పుడు 10,000 ఉద్యోగాలు కట్!
న్యూఢిల్లీ:ఆటోమొబైల్ సేల్స్ భారీగా పడిపోయి కంపెనీల్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. డీలర్స్ దుకాణాలను క్లోజ్ చేస్తున్నారు. దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కూడా ముందుకు సాగడం లేదు. ఆటో రంగం తర్వాత FMCG రంగం భారీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సేల్స్ పెద్ద ఎత్తున పడిపోయాయి. బ్రిటానియా, పార్లే, డాబుర్ వంటి దిగ్గజ కంపెనీల సేల్స్ దిగజారాయి. ఈ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగించే పరిస్థితులు ఏర్పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
రూ.40,000కు సమీపంలో బంగారం, కొనుగోలు చేసినా నష్టం లేదా?
10,000 మంది ఉద్యోగుల తొలగింపు ఛాన్స్
ప్రముఖ బిస్కట్ కంపెనీ పార్లే ప్రోడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆర్థిక వృద్ధి మందగించడంతో పాటు ఈ కంపెనీకి ఎక్కువగా సేల్స్ ఉండే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ భారీగా తగ్గిన నేపథ్యంలో జాబ్ కట్ ఉండవచ్చునని బుధవారం కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
ప్రభుత్వం కల్పించుకోకుంటే..
పార్లే బిస్కట్ అమ్మకాలు భారీగా తగ్గినందువల్ల ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. దీని వల్ల 8,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు కోల్పోయే ప్రమాదం ఉందని, పార్లే కేటగిరీ హెడ్ మయాంక్ షా వెల్లడించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం కల్పించుకోకుంటే క్లిష్ట పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
లక్షమందికి పైగా ఉద్యోగులు..
పార్లే కంపెనీని 1929లో స్థాపించారు. ఇందులో ప్రస్తుతం లక్ష మందికి పైగా ఉద్యోగులు (డైరెక్ట్, కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి ) పని చేస్తున్నారు. పార్లే బిస్కట్లలోని Parle-Gకి మంచి డిమాండ్ ఉంటుందని, 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిందని మయాంక్ షా అన్నారు. అధిక ట్యాక్స్ కారణంగా బిస్కట్ ప్యాకెట్లో తక్కువ క్వాంటిటీ ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
గ్రామీణంలోనే డిమాండ్.. కానీ
మరోవైపు, గ్రామీణ భారతంలో డిమాండ్ తగ్గిందని, ఇక్కడి నుంచే తమకు సగాని కంటే ఎక్కువ రెవెన్యూ వస్తోందని షా చెప్పారు. కానీ ఇది పడిపోయిందన్నారు. ఇక్కడి కన్స్యూమర్లకు ప్రైస్ సెన్స్ ఉంటుందని, నిర్దిష్టమైన ధరకు ఎన్ని బిస్కట్లు వస్తాయో వారికి తెలుసునని చెప్పారు.
2003లో ప్రపంచంలోనే అత్యధిక సేల్స్ పార్లేజీ టాప్!
పార్లే బిస్కట్స్ యాన్యువల్ రెవన్యూ 1.4 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. జీఎస్టీ రేట్లు తగ్గించాలని గత ఏడాది నాటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేసింది. పార్లే గ్లూకోగా ఉన్న పేరును ఆ తర్వాత పార్లే-జీగా మార్చారు. 2003లలో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన బిస్కట్గా Parle-G నిలిచింది. ఇప్పుడు భారత ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆటో సేల్స్, ఎఫ్ఎంసీజీ మందగమనంలో కొనసాగుతున్నాయి.