ఆదాయపన్ను, జీఎస్టీలో రాయితీ కోరిన జగన్, అమరావతి నిధులపై ట్విస్ట్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. విభజన అనంతరం ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు తదితర అంశాలపై చర్చించారు. జమ్ము కాశ్మీర్కు సంబంధించి 370 ఆర్టికల్ రద్దుకు వైసీపీ మద్దతు పలికింది. మరుసటి రోజే జగన్ ప్రధానిని కలిసి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి సహకరించాలని కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు.
ఏపీ గ్రామసచివాలయ ఉద్యోగాలు: పరీక్ష తేదీ, ఏ భాషలో
మోడీ ముందు జగన్ చిట్టా
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన జగన్.. ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట పెద్ద చిట్టానే పెట్టారు. గోదావరి - కృష్ణా అనుసంధానానికి నిధులు కావాలని, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, రామాయపట్నంలో రేవు నిర్మించాలని కోరారు. ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం రాయితీలు ఇవ్వాలని కోరారు. పదేళ్ల పాటు జీఎస్టీ, ఐటీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఏపీలో చేపడుతున్న నవరత్నాల పథకాలకు సాయం చేయాలని కోరారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర చెరువుల అనుసంధానం కార్యక్రమానికి సహకరించాలన్నారు.
మోడీని వేల కోట్లు అడిగిన జగన్
రూ.22,948 కోట్ల రెవెన్యూ లోటును పూడ్చాలని జగన్ విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన రూ.5,103 కోట్లను రీయింబర్స్ చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఏపీలో ఇంటింటికి తాగునీటి కోసం చేపట్టిన వాటర్ గ్రిడ్కు సాయం అందించాలని కోరారు. రాష్ట్ర విభజన కారణంగా ఆదాయాలకు గండి పడిందని, 2014-15 నాటికి రూ.97వేల కోట్ల అప్పు ఉంటే 2018-19 నాటికి రూ. 2.59 లక్షల కోట్లకు చేరుకుందని, వెనకబడిన జిల్లాలకు రూ.2,100 కోట్లు అందాల్సి ఉండగా రూ.1,050 కోట్లు మాత్రమే విడుదల అయ్యానన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేబీకే తరహాలో రూ.రూ.23,300 కోట్లు మంజూరు చేయాలన్నారు.
ఆదాయపన్ను, జీఎస్టీలో రాయితీ కోరిన జగన్
వాటర్ గ్రిడ్కు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని, దీనికి కేంద్రం సాయం చేయాలని జగన్ ప్రధాని మోడీని కోరారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని, సమాచారం సరిగా లేకపోవడం వల్ల కేంద్రం 10.87 లక్షల మంది లబ్ధిదారులనే ఎంపిక చేసిందని, అర్హులైన మిగతా వారిని గుర్తించాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు కోసం పదేళ్ల పాటు జీఎస్టీలో, ఆదాయపన్నులో రాయితీ ఇవ్వాలన్నారు.
పీపీఏలపై ఫిర్యాదు!!
పీపీఏలు, రాజధాని అమరావతి అంశాలపై జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. పారదర్శకత, అవినీతిరహిత పాలన కోసం పలు సంస్కరణలు చేపట్టామని, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, గత అయిదేళ్లలో ఏపీలో విద్యుత్తు రంగంలో అస్తవ్యస్త విధానాలు అనుసరించారని, కొందరు వ్యక్తులకు లాభం చేకూరేలా అధిక ధరలకు పీపీఏలు కుదుర్చుకున్నారని, ఈ కారణంగా రూ.20వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, అందుకే సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగినందునే రివర్స్ టెండర్కు వెళ్తున్నట్లు ప్రధాని మోడీకి సీఎం జగన్ చెప్పారు.
అమరావతి నిధులు ఇప్పుడే కాదు..
రాజధాని నిర్మాణం పేరిట అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో నిర్మాణానికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి కోరుతామని జగన్ చెప్పారు. అమరావతి కోసం రూ.2500 కోట్లకు గాను రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని ప్రధానికి తెలిపారు. రాజధానిలో భూసంబంధిత అంశాలపై జగన్ ప్రత్యేక నివేదిక కూడా అందజేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. భూసమీకరణలో అక్రమాలు, రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పారని తెలుస్తోంది.
ఈ హామీలు నెరవేర్చండి...
- విభజన అనంతరం ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరం. విభజనతో 59% జనాభా, అప్పులు ఏపీకి రాగా, 47% మాత్రమే ఆదాయ వనరులు వచ్చాయి. రాజధానిని (హైదరాబాద్) కోల్పోవడంతో ఆర్థిక అవకాశాలు, ఆదాయాలు, కేంద్ర సంస్థలను కోల్పోయాం. పార్లమెంట్ ఇచ్చిన హామీ మేరకు హోదా ఇవ్వండి.
- వెనుకబడిన ఏడు జిల్లాలకు ఆరేళ్ల కాలానికి రూ.50 కోట్ల చొప్పున ఇప్పటికి రూ. 2,100 కోట్లు అందాలి. రూ.1,050 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేబీకే తరహాలో మిగిలిన రూ. 23,300 కోట్ల నిధులు ఇవ్వాలి.
పరిశ్రమల స్థాపన కోసం...
- ఏపీలో పరిశ్రమల ప్రోత్సాహానికి రాయితీలు ఇవ్వాలి. పదేళ్ల పాటు పాటు జీఎస్టీ, ఆదాయపన్ను నుంచి మినహాయింపులు ఇవ్వాలి. పదేళ్ల పాటు 100 శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం రీయింబర్స్మెంట్ ఇవ్వాలి.
రెవిన్యూ లోటు రూ. 22,948 కోట్లను పూడ్చాలి.
- పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో ఖర్చు చేసిన మొత్తం ఇవ్వాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం నిధులు మంజూరు చేయాలి.
- కడప స్టీల్ ప్లాంట్ విభజన హామీల్లో ఒకటి. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే ఎంపిక చేశాం. పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు కూడా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలి.
రాజధానికి ఆ తర్వాతే నిధులు..
- దుగరాజపట్నం వద్ద పోర్ట్ నిర్మిస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారని, కానీ అక్కడ పోర్ట్ ఏర్పాటు సాధ్యంకాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలని నీతి ఆయోగ్ సూచించిందని, దుగరాజుపట్నంకు బదులు రామాయపట్నం వద్ద పోర్ట్ నిర్మించాలి.
- అమరావతి నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు కోరుతాం.
ఉగాది వరకు ఇళ్లు..
- పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువుల అనుసంధానం కార్యక్రమానికి కేంద్రం సాయం అందించాలి. గోదావరి-కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమ తాగునీరు, సాగునీరు అందించే కార్యక్రమానికి సాయం చేయండి.
- ఇంటింటికీ రక్షిత తాగునీటి సదుపాయం కల్పించడానికి వాటర్ గ్రిడ్ పథకం తెస్తున్నాం. 2050 వరకూ ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా ఏర్పాటు చేస్తున్న గ్రిడ్కు రూ. 60 వేల కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా. దీనికి సహాయం చేయండి.
- వచ్చే ఉగాది నాటికి ఏపీలో 25 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తాం. సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ (సెక్) డేటా సరిగాలేకపోవడంతో ఏపీ నష్టపోతోంది. ఈ డేటా వల్ల కేవలం 10.87 లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. సెక్ డేటాను సరిచేసి, అర్హులందర్నీ ఎంపిక చేయాలి.