మల్టీప్లెక్స్ల హవా: భారీగా అమ్ముడవుతున్న సినిమా టిక్కెట్లు
నగరాల్లోని మల్టీ ప్లెక్స్ చెయిన్ల పంట పండుతోంది. సినిమా టిక్కెట్లు జోరుగా అమ్ముడవుతున్నాయి. మంచి స్టోరీలతో కూడిన భారీ సినిమాలు వస్తుండటం వల్ల థియేటర్ కు వెళ్లి సినిమాలు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్క్రీన్ ల సంఖ్య పెరగడం కూడా సినిమాలు చూసే వారిసంఖ్య పెరగడానికి దోహద పడుతోంది. ప్రాంతీయ భాషల్లో వచ్చే సినిమాలతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వచ్చే సినిమాలు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువత సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగులు కూడా వారాంతాల్లో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళుతుండటం బాగా పెరిగిపోతోంది. ఇలాంటివి మల్టీప్లెక్స్ ల వ్యాపారం పెరగడానికి దోహదపడుతున్నాయి. సినిమాలు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న వారి సంఖ్య ఎక్కువవుతున్న కారణంగా రానున్న కాలంలో వీటి వ్యాపారం మరింతగా పెరగవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి..
ఆమ్మో ఒకటో తారీఖు: మార్కెట్లను హడలెత్తించిన ఆగస్ట్
థియేటర్ కు వెళ్ళడానికే ఆసక్తి
* అందుబాటు ధరల్లో మొబైల్ ఫోన్లు, చవకగా మొబైల్ డేటా లభిస్తున్న నేపథ్యంలో వీడియోలు చూస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది.
* ప్రస్తుతం 35కు పైగా వీడియో అప్లికేషన్లు, 800 కు పైగా టీవీ చానళ్ళు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ సినిమా టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పెద్ద స్క్రీన్ పై సినిమాలు చూసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా మంచి కథలతో కూడిన సినిమాలు వస్తున్నాయి. ఫలితంగానే టిక్కెట్లు తెగుతున్నాయి.
* మొబైల్ ఫోన్ల ద్వారా సినిమాల టైలర్లు, టీజర్లు చూడటమే కాకుండా మూవీకి సంభందించిన అభిప్రాయాలూ చూస్తూ సినిమాలకు వెళుతున్న వారు పెరుగుతున్నారు.
ఇది లెక్క...
* 2019 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని మూడు ప్రధాన మల్టీ ప్లెక్స్ చెయిన్స్ 20 కోట్లకు పైగా టికెట్లు విక్రయించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే అమ్మకాలు 23 శాతం పెరిగాయి.
* పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం మన దేశంలో ఏడాదికి వంద కోట్ల టిక్కెట్లు అమ్ముడవుతాయట.
* 2019 ఆర్థిక సంవత్సరంలో ఐనాక్స్ లీజర్ రాబడి రూ. 1,692 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో పీవీఆర్ సినిమాస్ రాబడి రూ. 3,119 కోట్లుగా నమోదైంది.
* దేశవ్యాప్తంగా 2,500 మల్టీ ప్లెక్స్ స్క్రీన్ లు ఉండగా నాలుగింట మూడువంతులు సినీ పోలీస్, ఐనాక్స్ కు చెందినవే.
* బాక్స్ ఆఫీస్ రాబడి రూ. 10,000 కోట్ల వరకు ఉంటే అందులో సగం వాటా ఈ స్క్రీన్ ల ద్వారానే నమోదు అవుతుందట.
* 2018-19 సంవత్సరంలో సింగిల్ స్క్రీన్స్, చిన్న మల్టీప్లెక్స్ చైన్స్ టిక్కెట్ల అమ్మకాలు 20 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగాయని తెలుస్తోంది.
* గత ఐదేళ్ల కాలంలో స్క్రీన్ ల సంఖ్య 200కు పైగా పెరిగింది. ఏడాది కాలంలో ఒక్కో స్క్రీన్ లో సినిమాలు చూసే వారి సంఖ్య సగటున 1. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా.
టిక్కెట్ల బుకింగ్స్ కు దన్ను
* చిన్న థియేటర్లకన్నా మల్టీ ప్లెక్స్ లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, షాపింగ్, గేమ్స్, ఫుడ్ కోర్ట్స్ వంటివి ఉండటం వల్ల చాలామంది కుటుంబ సమేతంగా మల్టీప్లెక్స్ లకు వెళుతున్నారు. టిక్కెట్ల ధర కాస్త ఎక్కువగా ఉన్న తమకు మంచి ప్రైవసీ ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.
* మొబైల్ అప్స్, వెబ్ సైట్ల ద్వారా టిక్కెట్ల బుకింగ్ బాగా పెరిగి పోతోంది. అనేక రకాల ఆఫర్లు అందిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది వీటిని వినియోగించుకొని టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు.
* ఆన్ లైన్ బుకింగ్స్ సౌకర్యవంతంగా ఉండటం కూడా మల్టీప్లెక్స్ లకు ఎక్కువగా ఆదరణ లభించదానికి దోహదపడుతున్నాయి.