వ్యాలెట్ల మధ్య వార్ ... టెలికాం పరిస్థితే ఎదురవుతుందా?
ఇరువురి మధ్య యుద్ధం జరిగితే ఎవరో ఒకరు గెలుస్తారు. ఓడిపోయిన వారు వ్యూహాలు మార్చుకొని తమ విజయం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. మళ్ళీ మళ్ళీ ఓడిపోతే యుద్ధం జోలికి పోరు. గెలిచినా వారు ఓటమి దరిచేరకుండా చూసుకుంటారు. వ్యాపారంలో కంపెనీల మధ్య పోరు సహజమే. పోటీపడి ఉత్పత్తులు తెస్తూ కస్టమర్లను ఆకట్టుకొని లాభాలు పెంచుకోవాలనుకుంటాయి. ఈ పోరులో కొన్ని కంపెనీలు కస్టమర్ల ఆధారణ లభించక కాలగర్భంలో కలిసిపోతాయి. మరికొన్ని కంపెనీలు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాయి. ఇప్పుడు ఆర్ధిక సర్వీసులు అందిస్తున్న కంపెనీల మధ్య కూడా పోటీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుంటుందోనని పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
రిచ్గా రిటైర్ అవ్వాలనుకుంటే ఇలా చేయండి..
వ్యాలెట్ల హవా
* మొబైల్ ఫోన్ల వినియోగం విస్తృతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ రూపంలో అనేక రకాల లావాదేవీలు నిర్వహించేందుకు దోహదపడే వాలెట్లు ఇంకా పుట్టుకువస్తూనే ఉన్నాయి.
* రీఛార్జ్ లు, నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులు, టిక్కెట్ల బుకింగులు మరెన్నో రకాల లావాదేవీలు నిర్వహించడానికి డిజిటల్ వాలెట్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు.
* ఇలాంటి మొబైల్ వాలెట్లను ఫిన్ టెక్ కంపెనీలే కాకుండా బ్యాంకులు కూడా తెస్తున్నాయి.
* పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే, యోనో, ఐసీఐసీఐ పాకెట్స్, హెచ్ డీఎఫ్ సి పేజ్ తదితర వాలెట్లు అందుబాటులో ఉన్నాయి.
* ఇప్పటిదాకా మెసేజింగ్ యాప్ గా ఉన్న వాట్సాప్ కూడా పెమెంట్స్ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో వాలెట్ కంపెనీల మధ్య పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ఆఫర్లు ఉంటేనే ఆదరణ
* వాలెట్ల సంస్థలు కస్టమర్లను ఆకర్షించడానికి ప్రారంభంలో అనేక రకాల ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు అందిస్తుంటాయి. వీటికి ఆకర్షితులు అయ్యే చాలా మంది యాప్ లను డౌన్లోడ్ చేసుకొని వినియోగిస్తుంటారు. ఏదైనా యాప్ ఎక్కువ ఆఫర్లు ఇస్తుంటే దాన్నే ఎక్కువగా వాడతారు.
* చాలా మంది మొబైల్స్ లో అన్ని యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని ఆఫర్లు ఇస్తున్న వాటినే ముందు వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
టెలికాం పరిస్థితి వస్తే...
* టెలికాం కంపెనీలు కొత్త కస్టమర్లను సంపాదించుకోవడానికి ధరల యుద్దానికి దిగిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కాల్ చార్జీలు, డేటా చార్జీలను తగ్గించడంలో ఈ కంపెనీలు పోటీ పడ్డాయి.
* రిలయన్స్ జియో రంగ ప్రవేశం తర్వాత కంపెనీల మధ్య పోటీ తారా స్థాయికి వెళ్ళింది.
* దిగ్గజ కంపెనీల నష్టాలూ పెరిగిపోయాయి. తప్పని పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు మరికొన్ని కంపెనీల్లో విలీనం కావాల్సి వచ్చింది. మరిన్ని కంపెనీలు ఎలాగోలా నెట్టుకువస్తున్నాయి.
* భవిష్యత్ బాగుంటుందని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన కంపెనీలు అర్ధాంతరంగానే తమ వ్యాపారానికి స్వస్తి పలకాల్సి వచ్చింది.
* ఈ కంపెనీల మాదిరిగానే వాలెట్ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. కస్టమర్లను సంపాదించుకోవడానికి క్యాష్ బ్యాక్ లు , ఇతర ఆఫర్లు ఇస్తున్నాయి.
* నిధులు ఎక్కువగా ఉన్న కంపెనీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. నష్టాలు వచ్చినప్పటికీ తట్టుకుంటున్నాయి.
* మరి కొన్ని కంపెనీలు పోటీలో వెనకబడి పోతున్నాయి. ఆఫర్లు ఉంటే, కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తేనే వాటిని కస్టమర్లు గుర్తు పెట్టుకునే అవకాశాలు ఉంటున్నాయి.
* డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తెస్తోంది. వీటివల్ల కొన్ని సంస్థల పై ప్రభావము ఉంటోంది. వాటికి వచ్చే రాబడులు తగ్గిపోయే పరిస్థితి ఉంది. అయితే లావాదేవీలు పెంచుకొని లాభాలను ఆర్జిస్తేనే ఈ కంపెనీలకు మనుగడ ఉంటుందని లేకపోతే టెలికం కంపెనీల మాదిరిగా మారే పరిస్థితి రావొచ్చని పరిశీలకులు అంటున్నారు.
మరి భవిష్యత్ లోనూ రంగంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వేచి చూడాల్సిందే....