ఏపీ బడ్జెట్ కేటాయింపులపై జనసేన అసంతృప్తి, నిరుద్యోగుల ఊసేది?
అమరావతి: వైసీపీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేసింది. బీసీ ఉప ప్రణాళిక కోసం రూ.15,061 కోట్లకు పైగా కేటాయించారు. బీసీలకు ఏటా రూ.15,000 కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.75,000 కోట్లు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు బడ్జెట్లో ఆ మొత్తం కేటాయించారు.
చదవండి: ఏపీ బడ్జెట్, జగన్ హామీలు-ఏ స్కీంకు ఎంత: ఆరోగ్యశ్రీకి కండిషన్, మద్యపాన నిషేదంపై కీలక అడుగు
ఆర్థిక సాయం..
బీసీ విద్యార్థుల కోసం అమ్మఒడి పథకానికి రూ.1,294 కోట్లకు పైగా కేటాయించారు. పిల్లల్ని బడికి పంపిస్తే తల్లులకు ఏటా రూ.15వేలు ఇస్తారు. బీసీ కులాలకు చెందిన 29 కార్పోరేషన్లకు ఉప ప్రణాళికలో భాగంగా రూ.3,964 కోట్లకు పైగా కేటాయించారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ప్రతి ఏడాది రూ.10,000 ఆదాయ మద్దతు కోసం రూ.200 కోట్లు కేటాయించింది. దీంతో 23వేల మంది బ్రాహ్మణులకు, 1,92,000 మంది రజకులకు లబ్ధి చేకూరనుంది. దర్జీలకు ప్రతి ఏటా రూ.10వేల ఆదాయ మద్దతు కోసం రూ.100 కోట్లు కేటాయించారు. చేనేత కుటుంబాలకు రూ.24వేల చొప్పున వైయస్సార్ పేరుతో ఆర్థిక సాయం చేస్తారు. ఇందుకు రూ.200 కోట్లు కేటాయించారు.
వివాహ కానుక
బీసీ వర్గాలకు పెళ్లి కానుక కింద రూ.300 కోట్లు కేటాయించారు. బీసీ కులాల వధువులకు రూ.50 వేల చొప్పున వివాహ కానుక అందిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 75వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి వైయస్సార్ చేయూత కింద రానున్న నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75వేలు ఇవ్వనున్నారు.
రిజర్వేషన్లు
బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్స్ కోసం రూ.2,218 కోట్లు కేటాయించారు. బీసీల కోసం 139 కార్పోరేషన్లను ఏర్పాటు చేసి, ఆ తర్వాత వైయస్సార్ చేయూత పథకాన్ని అమలు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దేవాలయ ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పోరేషన్లు తదితర నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం తేనున్నారు. కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ప్రమాదవశాత్తూ బీసీ కులాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబానికి వైయస్సార్ బీమా ద్వారా రూ.50వేలు. వైసీపీ ప్రభుత్వం తన పథకాలకు ఎక్కువగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు, ఆ తర్వాత సీఎం జగన్ పేరు పెట్టింది.
గతంలో చంద్రన్న.. ఇప్పుడు వైయస్సార్ పేరిట పథకాలు
బడ్జెట్ కేటాయింపులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై జనసేన కూడా స్పందించింది. బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతౌల్యం లేదని జనసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. నవరత్నాల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారని, కానీ అందుకు అవసరమైన నిధులు ఎక్కడనుంచి వస్తాయనేదానిపై స్పష్టత లేదని పేర్కొంది. గడువులోగా పోలవరం పూర్తికావాలంటే రూ.32 వేల కోట్లు కేటాయించాలని, కానీ ఈ ఏడాది రూ.5 వేల కోట్లు ఇచ్చారన్నారు.రైతులకు సున్నా వడ్డీ రుణాలిస్తామని ప్రకటించి రూ.100 కోట్లే కేటాయించారని, గతంలో చంద్రన్న పథకాలుంటే ఇప్పుడు వైయస్సార్ పేరిట పథకాలు వచ్చాయన్నారు. కొన్ని పథకాలకైనా దేశం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన మహనీయుల పేర్లు పెట్టకపోవడం సరికాదన్నారు.
5 నిరుద్యోగ భృతిపై చంద్రబాబు పెదవి విరుపు
బడ్జెట్లో నిరుద్యోగుల ప్రస్తావన లేదని ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు పెదవి విరిచారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోటిన్నర మంది నిరుద్యోగుల గురించి మాట్లాడారని, ఇప్పుడు బడ్జెట్లో ఏమిచ్చారని ప్రశ్నించారు. 'మేం ఐదు లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతి ఇస్తుంటే రాష్ట్రంలో 1.72 కోట్లమంది నిరుద్యోగులు ఉన్నారని, వారి సంగతి ఏమిటని ఆ రోజు మీరు (జగన్) ప్రశ్నించారు. మరి మీ బడ్జెట్లో ఆ నిరుద్యోగుల ఊసు ఎందుకు లేదు? మీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 1.72 కోట్ల మంది నిరుద్యోగులకు ఏమిస్తున్నారో చెప్పాలి' అని ప్రశ్నించారు.
నిరుద్యోగ భృతికి ఎసరు
వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రతి నెల రూ.2వేలు అందించింది. మొదట రూ.1000 ఇచ్చిన నాటి టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత రూ.2వేలకు పెంచింది. కాగా, నిరుద్యోగులకు కంటితుడుపు భృతుల కన్నా పని కల్పించడం అవసరమని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల మంది, ప్టణ ప్రాంతాల్లో 81వేల మంది వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు.