ఏపీ బడ్జెట్-ఆదాయ వనరులేవి?: జగన్ హామీలే రూ.70వేల కోట్లు, రూ.1,98,000 కోట్ల ఆదాయం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు (జూలై 12) తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆగస్ట్ నుంచి అమల్లోకి వచ్చేలా 8 నెలల కాలానికి ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన నవరత్నాలు హామీల అమలు లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంటుంది. రూ.2.18 నుంచి రూ.2.31 లక్షల కోట్ల అంచనాలతో ఉంటుందని తెలుస్తోంది. నవరత్నాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి బుగ్గన కూడా ఆయా శాఖలకు ఇందుకు సంబంధించి సూచనలు చేశారు. ఆరోగ్యశ్రీ, వైయస్సార్ చేయూత, రైతు భరోసా, అమ్మఒడి వంటి పథకాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇచ్చిన హామీలకు రూ.70,000 కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది.
చదవండి: ఏపీకి జగన్ గుడ్న్యూస్: ఏడాదికి రూ.250 పెంపు, వాలంటీర్ల భారం ఏంతంటే?
కేటాయింపులు ఇలా ఉండవచ్చు...
జగన్ ప్రకటించిన నవరత్నాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పెన్షన్ పథకానికి రూ.18,000 కోట్లు, అమ్మఒడికి రూ.6,500 కోట్లు, రైతు భరోసాకు రూ.8,500 కోట్లు, గృహ నిర్మాణంకు రూ.8,000 కోట్లు, జలవనరులకు రూ.12,000 కోట్లు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.12,000 కోట్లు, ఇందులో ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు, పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కోసం రూ.2,000 కోట్లు, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం రూ.2,000 కోట్లు, రైతులకు పంట బీమాకు రూ.2,163 కోట్లు, విపత్తుల నిర్వహణ నిధికి రూ.2,000 కోట్లు, ధరల స్థిరీకరణ కోసం రూ.3,000 కోట్లు, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,150 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.5,000 కోట్లు కేటాయించనున్నారని తెలుస్తోంది.
రూ.1,98,000 కోట్ల ఆదాయ అంచనా
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం రూ.1,98,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్లో దాదాపు రూ.2.25 లక్షల కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావించినా, అది తగ్గుతుందని భావిస్తున్నారు. ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు సొంత ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.
ఆదాయ వనరులు ఏవి?
వైసీపీ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్ల నుంచి రూ.86వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కేంద్రం నుంచి గ్రాంట్లరూపంలో రూ.60వేల కోట్లు వస్తాయని భావిస్తున్నారు.కేంద్ర పన్నుల వాటా ద్వారా రూ.36 వేల కోట్లు ఏపీకి వస్తాయని భావిస్తున్నారు. కేంద్రం నుంచి రెవెన్యూ లోటు, లోటు భర్తీ, ఇసుకపై ఆదాయం, మరిన్ని ఇతర మార్గాల ద్వారా రూ.17వేల కోట్ల రూపాయల మేర రావొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా రూ.1,98,000 కోట్ల ఆదాయం అంచనా వేస్తోంది.
అయిదేళ్లలో అప్పులు
గత అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వం నికరంగా రూ.1,00,658.37 కోట్ల అప్పులు చేసిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విభజన నాటికి రాష్ట్రంపై ఉన్న రుణ భారం? గత అయిదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న రుణాలు? ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న రుణభారం ఎంత? అని ఎమ్మెల్యేలు పార్థసారథి, సుధాకర్బాబు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో ఆయన సమాధామిచ్చారు. 2014 జూన్ నాటికి రూ.1,30,654.34 కోట్ల రుణాలు ఉన్నాయని, 2019 మే 30 నాటికి ఇది రూ.2,61,302.81 కోట్లకు చేరిందన్నారు.