బడ్జెట్ దెబ్బ, ఐటీ కంపెనీలపై బైబ్యాక్ షాక్: ప్రభుత్వం ట్యాక్స్ ఎందుకు విధించిందో తెలుసా?
లిస్టైన కంపెనీల షేర్ల బైబ్యాక్ పైన 20 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అన్లిస్టెండ్ కంపెనీలపై ఉంది. ఇప్పుడు లిస్టెడ్ కంపెనీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బైబ్యాక్ ఎక్కువగా ఐటీ కంపెనీలే ప్రకటిస్తుంటాయి. గత ఏడాది (2018)లో 41 కంపెనీలు మార్కెట్ నుంచి దాదాపు 50,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేశాయి. ఇందులో 7 ఐటీ కంపెనీల షేర్ల బైబ్యాక్ 92 శాతంగా ఉండటం గమనార్హం.
ఈ బడ్జెట్ ప్రభావం మీపై ఎలా ఉంటుంది.. ఇవి తెలుసుకోండి
బైబ్యాక్ నుంచి డివిడెండ్కు...
మూలధనం పొందేందుకు బైబ్యాక్ అనేది భారతదేశంలో ఇప్పటి వరకు సులభమార్గంగా ఉండేదని, ఎందుకంటే దీనిపై పన్ను విధించలేదని, ఇది కంపెనీలకు కూడా అభివృద్ధి చెందేందుకు తోడ్పడిందని, మార్కెట్ స్టాక్ తగిన ధర నిర్ణయించడం లేదని తెలిసినప్పుడు కంపెనీల విలువను మెరుగుపరిచేందుకు ఇది సహాయపడిందని ఇన్ఫోసిస్ మాజీ ఫైనాన్స్ చీఫ్ వి బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బైబ్యాక్పై హఠాత్తుగా ట్యాక్స్ వేస్తున్నారని, అప్పుడు కంపెనీలు డివిడెండ్కు మారుతాయని అభిప్రాయపడ్డారు.
లూప్హోల్ను ఉపయోగించుకున్న కంపెనీలు
సాధారణంగా లిస్టెడ్ కంపెనీలు డివిడెండ్ లేదా బైబ్యాక్ మార్గాల్లో తమ నగదు నిల్వలను షేర్ హోల్డర్స్కు పంచుతాయి. డివిడెంట్ చెల్లింపులపై కంపెనీలు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT) కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లకు సైతం డివిడెండ్ పైన పన్ను వేస్తుంది. దీంతో కంపెనీలు డివిడెండ్ కంటే బైబ్యాక్ను ఆశ్రయిస్తున్నాయి. ఇప్పటి వరకు షేర్ల బైబ్యాక్ పైన ట్యాక్స్ లేదు. డివిడెండ్ పేమెంట్పై 15 శాతం ట్యాక్స్ ఉంది. ఈ లూప్హోల్ను కంపెనీలు ఉపయోగించుకోవడంతో, ప్రభుత్వం కూడా ప్రతిగా బైబ్యాక్ పైన 20 శాతం ట్యాక్స్ వేసింది.
టాప్ కంపెనీల బైబ్యాక్ ఇలా...
టెక్నాలజీ కంపెనీలు తమ షేర్ హోల్డర్స్కు బైబ్యాక్, డివిడెండ్ ఇష్యూల ద్వారా రివార్డులు ఇస్తున్నాయి. గత ఏడాది కాలంలో టాప్ కంపెనీలై టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో వంటి సంస్థల బైబ్యాక్ వ్యాల్యూ రూ.40,725 కోట్లు. ఇటీవల బైబ్యాక్ను విప్రో ఎక్కువగా ఉపయోగించింది. గత మూడు బైబ్యాక్లలో 14 శాతం షేర్లు తిరిగి కొనుగోలు చేసింది. కాగా, గత ఏడాది టాప్ కంపెనీల బైబ్యాక్ రూ.40,725 కోట్ల ఆధారంగా చూస్తే దీని ద్వారా ప్రభుత్వానికి రూ.8,145 ఆదాయం వచ్చేదని విశ్లేషకులు చెబుతున్నారు.
డివిడెండ్ వడ్డీంపు తగ్గించుకునేందుకు..
డివిడెండ్ వడ్డింపును తప్పించుకునేందుకు కంపెనీలు బైబ్యాక్ను ఇప్పటి దాకా ఎంచుకున్నాయి. దీనిని నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం ప్లాన్గా బైబ్యాక్ పైన ట్యాక్స్ తీసుకు వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీలు బైబ్యాక్ మాట ఎత్తే అవకాశాలు సన్నగిల్లాయని చెబుతున్నారు. బైబ్యాక్లు భారీగా తగ్గడం వల్ల కంపెనీలు తమ వాటాదారులకు సంపదను పంచడం తగ్గే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. సాధారణంగా కంపెనీలు స్టాక్ మార్కెట్లో ప్రతికూలతలు ఎదుర్కొన్నప్పుడు, ఆదరణ తగ్గుతున్నప్పుడు బైబ్యాక్ ప్రకటిస్తాయి. అప్పుడు షేర్లలో ట్రేడింగ్ పెరుగుతుంది. కంపెనీల మార్కెట్ విలువకు ఇది దోహదపడుతోంది. ఇప్పుడు బైబ్యాక్ ప్రభావం ఎక్కువగా ఐటీ కంపెనీలపై ఉంటుందని భావిస్తున్నారు.
ప్రభుత్వంపై ప్రభావం ఎలా..
కంపెనీలు బైబ్యాక్ ప్రకటించినప్పుడు కొద్ది వారాలు కంపెనీల షేర్ల ట్రేడింగ్ వ్యాల్యూ పెరుగుతుంది. దీంతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరిగి, వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతోందని, సెబీకి ఫీజుల రూపంలో ఆదాయం కూడా వచ్చే అవకాశముందని, బైబ్యాక్లు తగ్గితే ప్రభుత్వానికి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఆదాయం, స్టాక్ ఎక్స్చేంజ్, సెబికి రుసుము ఆదాయం తగ్గవచ్చునని అంటున్నారు. అయితే బైబ్యాక్కు వచ్చే కంపెనీల నుంచి వసూలు చేసే 20 శాతం ట్యాక్స్తో ఆ లోట భర్తీ చేసుకోవచ్చునని చెబుతున్నారు.