చైనా నుంచి బయటకొస్తున్న కంపెనీలపై కన్నేసిన భారత్..కారణం అదేనా..?
చైనా అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు జంకుతున్నాయి. అలాంటి కంపెనీలపై భారత్ దృష్టి సారించింది. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రోత్సహాకాలు ఇస్తామంటూ ముందుకొస్తోంది. ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ కంపెనీలను ఆకట్టుకునేందుకు భారత్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
చైనాలో తమ కంపెనీలు స్థాపించాలని భావించి అమెరికా నుంచి ఎదురవుతున్న కఠిన నిర్ణయాలతో డీలా పడ్డ కంపెనీలకు భారత్ మార్గం చూపిస్తోంది. చైనాలో కాకుంటే భారత్లో తమ పెట్టుబడులు, కంపెనీలు స్థాపించాలంటూ రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతోంది. ఇందుకోసం కావాల్సిన అన్ని టాక్స్ బెనిఫిట్లు, ప్రోత్సహాకాలు కల్పిస్తామని భారత్ భరోసా ఇస్తోంది. ఈ విషయాన్ని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రోత్సహాకాలు ఇస్తామని భావిస్తున్న కంపెనీల్లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఫుట్వేర్ మరియు టాయ్స్ సంస్థలు ఉన్నాయి.
టారిఫ్లు ఇవ్వడం ద్వారా వియత్నాం మరియు మలేషియా ఆర్థిక వ్యవస్థలు బాగుపడ్డాయని అదే సమయంలో భారత్ పలు పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలను కోల్పోయిందని వాణిజ్యశాఖ వెల్లడించింది. దిగుమతి వస్తువులపై సుంకం తగ్గించి ఎగుమతులపై దృష్టి సారించాలనే యోచనలో కేంద్ర వాణిజ్యశాఖ ఉన్నట్లు సమాచారం. అయితే ఇందుకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందాల్సి ఉంది. ఇక భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు భారత సముద్ర తీరంలో ఇండస్ట్రియల్ జోన్లను ఏర్పాటు చేసి స్థానిక ఉత్పత్తిదారులకు తొలి ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇలా చేయడం వల్ల భారత ఉత్పత్తి కేంద్రాన్ని పెంపొందించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక ప్రాజెక్టు అయిన మేకిన్ ఇండియా కార్యక్రమంకు కూడా ఊతం ఇచ్చినట్లు అవుతుందని భారత్ భావిస్తోంది. తద్వారా 2020 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 25 శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం చైనాలో పెట్టుబడులు పెట్టే కంపెనీల్లో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, కన్స్యూమర్ అప్లయెన్సెస్, వాహన విడిభాగాలు, రోజువారీగా వాడే బెడ్లు, లినెన్, కిచెన్ వేర్ వంటివి ఉన్నాయని... భారత్ వీటిలో 95శాతం వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోందని ప్రభుత్వం చెబుతోంది.