భారత్లో ఉద్యోగాల సమస్యలేదు, చైనా అలా.. మనం ఇలా..: ఇన్ఫోసిస్ మాజీ CFO
భారత్ ఉద్యోగాల సమస్యను ఎదుర్కోవడం లేదా? అసలు సమస్య ఎక్కడ ఉంది? వేతనాలే అసలు సమస్యనా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, మల్టీ సెక్టార్ ఇన్వెస్టర్ టీవీ మోహన్దాస్ పాయ్. భారత్లో ఉన్నది ఉద్యోగాల సమస్య కాదని, వేతనాల సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. డిగ్రీ హోల్డర్లకు అనుకూలంగా ఉన్న ఉద్యోగాల కల్పన లేదని, తక్కువ వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఉంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎప్పుడు తీస్తారు: వడ్డీ రేటు వివరాలు.
భారత్లో ఉద్యోగాల కొరత లేదు, వేతనాల కొరత ఉంది
భారత్లో మంచి ఉద్యోగాలు (వేతనపరంగా అనుకూలమైన ఉద్యోగాలు) లభించడం లేదని మోహన్దాస్ పాయ్ అన్నారు. కేవలం రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లించే తక్కువ వేతన ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇవి డిగ్రీ హోల్డర్స్కు సరిపోయే ఉద్యోగాలు కాదని చెప్పారు. కాబట్టి భారత్లో ఉన్నది ఉద్యోగాల సమస్య కాదని, వేతనాల సమస్య అన్నారు.
చైనా ఇలా...
భారత్లో వేతనాల సమస్యే కాకుండా ఇతర సమస్యలు కూడా ఉన్నాయని మోహన్దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ, భౌగోళిక సమస్యలు కూడా ఉన్నాయని చెప్పారు. చైనా ఎలా ముందుకు వెళ్లిందో చూడాలన్నారు. చైనా తొలుత లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీని ఓపెన్ చేశారని, తద్వారా ప్రపంచాన్ని ఆహ్వానించారని, తమ లేబర్ను వినియోగించుకునేలా చేశారని, ఆ తర్వాత ఎగుమతులు ప్రారంభించారని చెప్పారు. మనం లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమను ప్రోత్సహించలేదన్నారు. మన వద్ద సరైన పాలసీలు లేవని, కాబట్టి మన వద్ద ఉన్న సర్ప్లస్ లేబర్ను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నట్లు చెప్పారు.
మనం అలా చేయలేకపోయాం
అలాగే, చైనా పలు ప్రాంతాల్లో హైటెక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు అవసరమైనచోట ఇన్వెస్ట్ చేసిందని మోహన్దాస్ పాయ్ చెప్పారు. ఎలక్ట్రానిక్ అసెంబ్లింగ్, చిప్ క్రియేషన్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసిందని ఉదాహరణగా చెప్పారు. మరో ముఖ్య విషయం ఏమంటే చైనా కోస్టల్ ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించిందని చెప్పారు. దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై దూరం తగ్గిందని చెప్పారు. కానీ మనం చైనా వలె కోస్టల్ ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించలేదన్నారు.
ఉద్యోగాలు కల్పన ఇలా....
2018లో 11 మిలియన్ ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటాపై కూడా మోహన్దాస్ పాయ్ స్పందించారు. ఈ సర్వేలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 15-29 ఏళ్ళ ఏజ్ గ్రూప్ వంటి లోపాలు ఉన్నాయని తెలిపారు. EPFO పేరోల్ డేటా ప్రకారం ప్రతి ఏడాది 60 to 70 లక్షల పార్మల్ ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. వాహనాల విక్రయాలు కూడా ఉద్యోగాల పరిస్థితిని వెల్లడిస్తాయని అభిప్రాయపడ్డారు. వీటి వల్ల కూడా ఏడాదికి 30 నుంచి 35 లక్షల మంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారని చెప్పారు. ఉదాహరణకు ఏడు లక్షల ట్రాక్టర్లు, ఆరు లక్షల ఆటో రిక్షాలు, ఏడున్నర లక్షల ట్రక్స్ ప్రతి ఏడాది కొనుగోలు చేస్తే, అలాగే 28 లక్షల కార్లు కొనుగోలు చేస్తే ఐదు లక్షల మంది వరకు డ్రైవర్లు అవసరమని, మొత్తంగా 30 నుంచి 35 లక్షల మంది డ్రైవర్లు అవసరమని, ఆ మేర ఉద్యోగ కల్పన జరుగుతోందన్నారు.