తెలంగాణకు మిగులు ఎంత అంటే, ఏపీపై ఏడాదికి 40 వేలకోట్ల అప్పు: జగన్ ఆందోళన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అయిదో సమావేశంలో నలుగురు ముఖ్యమంత్రులు మినహా అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్లో సభ్యులుగా ఉన్న కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో కరువు, వ్యవసాయ రంగం సంక్షోభం, నక్సలైట్ ఇష్యూ, వర్షపు నీరు ఆదా తదితర ఎన్నో అంశాలపై చర్చించారు. 2024 నాటికి భారత్ను రూ.350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిని చేరుకోవడం కోసం టీమిండియాలా పని చేయాలని ప్రధాని మోడీ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు కావాలో చెప్పే ప్రయత్నం చేశారు.
జగన్ నోట చంద్రబాబు వ్యాఖ్యలు
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని, కానీ హోదా ఇవ్వవద్దని ఎక్కడా సిఫార్సు చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్ సేన్ రాసిన లేఖను నీతి అయోగ్ సమావేశంలో జగన్ ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ 98 పేజీల నివేదికను జగన్ అందించారు. విభజన అనంతరం ఆర్థిక నగరం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిందని, పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే పరిశ్రమలు వస్తాయని, విభజన అనంతరం ఏపీ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మాత్రమే మిగిలి ఉందన్నారు. విభజన తర్వాత ఆర్థికంగా కుంచించికుపోయిన ఏపీ.. చంద్రబాబు ప్రభుత్వ లోపభూయిష్ట పాలన వల్ల ప్రమాణాలు మరింత పడిపోయాయన్నారు. అన్యాయ, అశాస్త్రీయ విభజన జరిగిందన్నారు. జనాభా, అప్పులకు సంబంధించి ఏపీకి వారసత్వంగా సుమార్ 59 శాతం లభిస్తే ఆదాయం మాత్రం 47 శాతమే దక్కిందన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు జగన్ అదే అంటున్నారు.
తెలంగాణకు భారీ మిగులు, ఏపీకి మూడింతల లోటు
2015-2020.. ఈ అయిదేళ్ల కాలంలో ఏపీకి విభజన అనంతరం ఆదాయ లోటు రూ.22,113 కోట్లు ఉందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసిందని, అదే సమయంలో తెలంగాణకు విభజన అనంతరం ఆదాయ మిగులు రూ.1,18,678 కోట్లుగా ఉందని తేల్చారని జగన్ చెప్పారు. కానీ వాస్తవంలోకి వస్తే ఏపీ ఆదాయ లోటు రూ.66,362 కోట్లుగా ఉందన్నారు.
హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో...
విభజనకు ముందు ఆర్థిక సంవత్సరం (2013-14) సమైక్య ఏపీలో రూ.57వేల కోట్ల విలువైన సాఫ్టువేర్ ఉత్పత్తులు ఎగుమతి అయితే అందులో హైదరాబాద్ నుంచే రూ.56,500గా ఉందన్నారు. విభజన అనంతరం 2015-16లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.14,411గా ఉంటే, ఏపీలో మాత్రం రూ.8,397గా ఉందన్నారు. తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం తక్కువ అని, దీనిని పూడ్చేందుకే హోదా హామీని కేంద్రం ఇచ్చిందని చెప్పారు. ఐటీ సెక్టార్ హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో ఏపీ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మాత్రమే మిగిలిందన్నారు. విభజన నాటికి రూ.97వేల కోట్లుగా ఉన్న ఏపీ అప్పు ఇప్పుడు రూ.2.59 లక్షల కోట్లుగా ఉందన్నారు.
ఏపీపై ఏడాదికి రూ.40వేల కోట్ల భారం
అప్పుల నేపథ్యంలో ఏపీపై అసలు, వడ్డీ కలిసి ఏడాదికి రూ.40వేల కోట్ల భారం పడుతోందని జగన్ అన్నారు. రూ.20 వేల కోట్ల అసలు, రూ.20వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. హోదా ఇస్తే తమకు గ్రాంట్ ఇన్ఎయిడ్గా వచ్చే మొత్తం పెరుగుతుందని, దీంతో పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ - ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాలు ఇస్తాయన్నారు. దీంతో ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. హోదా ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్ హోటల్స్, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా ఉందని గుర్తు చేశారు.
హోదా ఇస్తే ఇవీ లాభాలు
రూ.2.59 లక్షల కోట్ల అప్పులు, ఏడాదికి రూ.40వేలకోట్ల భారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని జగన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో హోదానే కీలకం అన్నారు. హోదా వల్ల ఏపీకి అధికంగా నిధులు, సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. సాధారణ రాష్ట్రాల కంటే ఎక్కువ గ్రాంట్లు వస్తాయన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకు తలసరి గ్రాంట్ రూ.5,573 కాగా, ఏపీకి రూ.3,428 మాత్రమే అన్నారు. హోదా ఉంటే ఆదాయపు పన్ను, జీఎస్టీ మినహాయింపు, ఇతర రాయితీలు, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు.