ఏపీఎస్ఆర్టీసీకి ఎక్కడెంత అప్పు, జగన్ ప్రభుత్వంపై భారమెంత?
అమరావతి: 26 డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చిన ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాయి. ఇందుకు ప్రధాన కారణం డిమాండ్లను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడం, అలాగే ఆర్టీసిని ఆదుకుంటామని, ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడమే. విలీనం చేయాలని ఏపీ కేబినెట్ మూడు రోజుల క్రితమే నిర్ణయించింది. విలీన ప్రక్రియ సులభతరం అయ్యేందుకు కమిటీలు వేస్తున్నారు. విలీనం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు, ఆర్టీసీని ఉపయోగించే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అదే సమయంలో ఆర్టీసీ విలీనం వల్ల ప్రభుత్వంపై వేల కోట్ల భారం కూడా పడనుంది.
జగన్ అనూహ్య నిర్ణయం: ఆర్టీసీ విలీనం వల్ల ఎవరికి లాభం, ఎలా?
ప్రభుత్వానికి మరింత భారం
ఆర్టీసీ ఆరువేల కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో ఉందని ఇటీవల మంత్రి నాని చెప్పారు. ఆర్టీసీ తనఖా పెట్టిన చేసిన అప్పులు, ఇతర అప్పులు కలిపి పెద్ద మొత్తం ఉంది. ఆర్టీసీ ఏడాదికి 13 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం డీజిల్ పైన రూ.2 సర్ఛార్జ్ విధించడం, సేల్స్ ట్యాక్స్తో ఆర్టీసీపై కొంత ఆర్థిక భారం పడిందని భావిస్తున్నారు. నెలకు ఉద్యోగులకు వేతనాల రూపంలో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆక్యుపెన్సీ రేటు 83 శాతంగా ఉంది. ఆక్యుపెన్సీలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని చెబుతున్నారు. పైగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ఇది ప్రభుత్వానికి మరింత భారం కానుందని అంటున్నారు.
ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ
ఆర్టీసీ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతోంది. కానీ నిర్వహణ వ్యయం అంతకంటే ఎక్కువ అవుతోంది. దీంతో నష్టాలు వస్తున్నాయి. 2018-19లో ఆర్టీసీ బస్సును కిలో మీటర్ నడిపితే రూ.44.58 ఖర్చు అయితే, ఆదాయం మాత్రం రూ.38.05 వస్తుంది. డీజిల్ ధర పెరుగుతున్నందున దీనిపై వెచ్చించే మొత్తం ఆర్టీసీకి భారంగా మారుతోంది. గత ఆర్థిక సంవత్సరం ఆర్టీసీకి వెయ్యి కోట్ల నష్టాలు వచ్చాయి. సంస్థకు మూడువేల కోట్లకు పైగా అప్పులు ఉండగా, కార్మికుల పీఎఫ్, ఇతర బకాయిల చెల్లింపుకు చెందిన మరో రూ.3వేల కోట్లకు పైగా ఉన్నాయి. మొత్తం 6వేల కోట్లకు పైగా భారం ఉంది.
ఆర్టీసీకి ఎక్కడెన్ని అప్పులు
ఆర్టీసీ గత నాలుగేళ్లలో వేల కోట్ల అప్పులు చేసింది. చెల్లించాల్సిన వడ్డీలు కోట్లలో ఉంటున్నాయి. చెల్లించాల్సిన అసలు, వడ్డీలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆర్టీసీ... బ్యాంకుల నుంచి రూ.2,026 కోట్ల రుణాలు తీసుకుంది. హడ్కో రుణాలు రూ.793 కోట్లు. పలు ట్రస్ట్ల నుంచి రూ.561 కోట్లు. తీసుకున్న రుణం రూ.3,380 కోట్లుగా ఉంది.
రూ.3,700 కోట్ల తక్షణ విడుదలకు సానుకూలం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలకు కార్మిక సంఘాల ఐకాస బుధవారం ధన్యవాదాలు తెలిపింది. ఆర్టీసికి తక్షణ సాయం కింద రూ.3,700 కోట్లు విడుదల చేయాలని వారు కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.
ప్రజాప్రయోజనం కోసమే ఆర్టీసీ
ఆర్టీసీకి సొంతగా దాదాపు 9,500 బస్సులు, అద్దెకు తీసుకున్నవి 2,500కు పైగా ఉంటాయి. ఉద్యోగులు 53వేల నుంచి 54వేల మధ్య ఉన్నారు. రోజుకు అరవై రెండు లక్షల మందికి పైగా ప్రయాణిస్తారు. ఆర్టీసీ బస్సులు రోజుకు 43 లక్షల కిలో మీటర్లకు పైగా తిరుగుతున్నాయి. రోజు ఆదాయం రూ.15 కోట్లు. అయితే, ఆర్టీసీని లాభనష్టాల సంస్థగా కాకుండా ప్రజాప్రయోజనాల సంస్థగా పరిగణించవలసి ఉంటుంది. ప్రభుత్వంలో విలీనమైతే అప్పుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. కార్మికుల నిబంధనలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మారే అవకాశముంటుంది. ప్రభుత్వంలో విలీనమైతే ఉద్యోగులకు భరోసా, ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తున్న సదుపాయాలు, పదవీ విరమణ పెంపు, ప్రజాప్రయోజనం కోసం కాబట్టి సర్వీసులు నిలిపేయాల్సిన పరిస్థితి ఉండదు.