బ్రహ్మోస్ సంయుక్త ప్రాజెక్టులో 40వేల కోట్లకు పెరిగిన పెట్టుబడులు
రష్యా భారత్ల సంయుక్త ప్రాజెక్ట్ సూపర్ సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ తయారీకి తొలుత రూ.1300 కోట్లు పెట్టుబడులు పెట్టగా ఇప్పుడు అది 40వేలకు పెరిగినట్లు కంపెనీకి సంబంధించిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సూపర్ సానిక్ మిసైల్ ప్రాజెక్టులా మరిన్ని సంయుక్త ప్రాజెక్టులు భారత్ - రష్యాలు చేపట్టాలని బ్రహ్మోస్ ఏరోస్పేస్ కంపెనీ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ మిశ్రా చెప్పారు. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న సమయంలో రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. ఆసమయంలోనే మరిన్ని ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్రహ్మోస్ భారత్ డిఫెన్స్ సంస్థ డీఆర్డీఓ మరియు రష్యా ఎన్పీఓ మాషినోస్త్రోయినియాల మధ్య 1998లో ఒప్పందం జరిగిందని చెప్పారు సుధీర్ మిశ్రా. మరోవైపు సూపర్ సానిక్ మిసైల్స్ భూమిపై గాలిలో, మరియు యుద్ధ నౌకల్లో ఉంచే అవకాశం ఉంది. 1300 కోట్ల పెట్టుబడులు తొలుత పెట్టినప్పటికీ ఇప్పుడు అది 40వేల కోట్లకు చేరుకుందని సుధీర్ మిశ్రా అన్నారు. ఇక ప్రభుత్వానికి పన్నుల రూపంలో 4వేల కోట్లు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కడుతున్నట్లు చెప్పారు.
ఈ సూపర్సోనిక్ మిస్సైల్ కొనుగోలుకు ఇతర అంతర్జాతీయ దేశాలు ఆసక్తి చూపాయా అని ప్రశ్నించగా..కొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక రష్యాతో చేయి కలిపిన సమయంలో భారత్ తన సాఫ్ట్వేర్ టెక్నాలజీని, ఉత్పత్తి సామర్థ్యాన్ని నమ్ముకుందని మిశ్రా తెలిపారు. తయారీ కేంద్రంగా భారత్ అవతరించినప్పటికీ ఆ తర్వాత కేవలం డిజైనింగ్, ఇంటిగ్రేషన్కే పరిమితమైందని చెప్పారు. ఇక ఆర్థిక సహకారం అందిస్తూనే రష్యా నుంచి అనేక మంది సైంటిస్టులను భారత్కు తీసుకొచ్చి వారితో టెక్నాలజీ డెవలప్ చేయిస్తున్నామని మిశ్రా చెప్పారు. ఈ రోజుటికి దాదాపు 200 కంపెనీలు తమ బిజినెస్ భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. తమ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 20వేల మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు.