తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: రూ.6,900 కోట్లు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు గుడ్ న్యూస్. రైతుబంధు పథకానికి చెందిన నిధులు విడుదల చేస్తూ సోమవారం జీవో విడుదలైంది. రూ.6,900 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ ఏడాది నుంచి ఏకరాకుు రూ.10వేల చొప్పున రైతుబంధు కింద నిధులు అందిస్తున్నారు. ఖరీఫ్, రబీ పంటలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది.
రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఒక పంటకు రూ.5వేలు ఇస్తున్నారు. అంటే ఏడాదిలోని రెండు పంటలకు రూ.10వేలు ఇస్తున్నారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానుంది. కాబట్టి ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. ఈ నెల 7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక జరిగిన అనంతరం రైతుబంధు సాయాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మొత్తాన్ని విడుదల చేసే తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
2,000 మంది జెట్ ఉద్యోగుల్ని తీసుకోనున్న స్పైస్జెట్
గత ఏడాది ఎకరాకు ఏడాదికి రూ.8వేలు ఇవ్వగా, ఇప్పుడు రూ.10వేలు ఇస్తున్నారు. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12వేల కోట్లు కేటాయించారు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్నవారికి ప్రభుత్వం రైతుబంధు సొమ్ము అందిస్తోంది. పెట్టుబడి వద్దనుకునే రైతులు గివ్ ఇట్ అప్ ఫారాన్ని మండల వ్యవసాయ అధికారికి ఇవ్వాలి. ఇలా మిగిలిన సొమ్మును రైతు సమన్వయ సమితికి అందిస్తారు.