మోడీ కేబినెట్: అమిత్ షాకు ఆర్థిక శాఖ, ఎందుకు?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ గురువారం రాత్రి గం.7.03లకు రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్లోకి ఎంతోమంది కొత్తవారు వచ్చారు. 57 మందితో కేంద్రమంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయమంత్రులు. మంత్రివర్గంలో 20 మంది కొత్తవారు. 35 మంది పాతవారికి చోటు దక్కలేదు. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ వంటి వారు తప్పుకోగా, కేబినెట్లోకి విదేశీ వ్యవహారాల మాజీ కార్యదర్శి సుబ్రహ్మణంయ జైశంకర్కు ఆశ్చర్యకరంగా కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. కేబినెట్లో 82 మందికి అవకాశముంది. తొలి విడతలో 57 మందిని తీసుకున్నారు. అయిదుగురు మహిళలు, మైనార్టీ నుంచి ఒకరికి స్థానం కల్పించారు. మోడీ కొత్త కేబినెట్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు చోటు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
GST కింద అరెస్ట్ అధికారాలు పరిశీలిస్తాం: సుప్రీం కోర్టు
అమిత్ షాకు ఆర్థికమంత్రి పదవి?
అమిత్ షాకు ఆర్థిక శాఖ లేదా హోంశాఖ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా ఆర్థిక శాఖ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అనారోగ్య కారణం వల్ల అరుణ్ జైట్లీ తప్పుకున్నారు. దీంతో ఆ శాఖను ఎవరికి అప్పగిస్తారనే చర్చ చాలా రోజులుగా సాగుతోంది. పీయూష్ గోయల్కు కట్టబెట్టవచ్చునని తొలుత భావించారు. కానీ ఇప్పుడు ఆర్థిక శాఖకు అమిత్ షా పేరు వినిపిస్తోంది. గురువారం ప్రమాణ స్వీకారం సమయంలో తొలుత మోడీ ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, మూడో స్థానంలో అమిత్ షా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో షాకు ఉన్న ప్రాధాన్యత తేలిపోయింది.
అందుకే ఆర్థిక మంత్రి బాధ్యతలా?
దీంతో మోడీ తర్వాత కేబినెట్లో రెండో కీలక వ్యక్తి రాజ్నాథ్ సింగ్ అని, ఆయన గతంలో చేపట్టిన హోంమంత్రి పదవిలో కొనసాగుతారని భావిస్తున్నారు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్కు ఆర్థిక మంత్రిగా పనిచేసి, వృద్ధిని పరుగులు పెట్టించాలంటే అనుభవం అవసరమని, అయితే ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న అమిత్ షా కేబినెట్లోకి రావడంతో కీలకమైన ఆర్థిక శాఖను ఆయన పార్టీ మాదిరే నేర్పుగా నడిపిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయట. అమిత్ షాకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేసిన అనుభవం ఉందని, ఆర్థిక శాఖపై ఆయనకు పట్టు ఉందని అంటున్నారు. గుజరాత్ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పోరేషన్ చైర్మన్గా పని చేశారు.
గతంలో అమిత్ షా చేపట్టిన శాఖలు
అమిత్ షాకు ఇప్పటికే ఆర్థిక శాఖ, కార్పోరేట్ వ్యవహారాల శాఖ బాధ్యతలు అప్పగించినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రోజు (శుక్రవారం మే 31) తేలిపోనుంది. 1980 నుంచి రాజకీయాల్లో మోడీ, అమిత్ షా చేయి చేయి పట్టుకొని తిరిగారు. మోడీ ప్రధాని అయ్యాక పార్టీలో నంబర్ 1, 2లుగా వ్యవహరిస్తున్నారు. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల తరువాత మోడీ ముఖ్యమంత్రిగా ఎన్నికవడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. దీంతో ఇరువురి మధ్య మరింత సఖ్యత పెరిగింది. ఏకంగా పది మంత్రిత్వశాఖలను కట్టబెట్టారు. ఇందులో హోమ్, న్యాయ, జైళ్లు, సరిహద్దు భద్రత, హౌసింగ్ తదితర కీలక శాఖలు ఉన్నాయి. మరోవైపు, అనూహ్యంగా కేబినెట్లో చోటు దక్కించుకున్న జైశంకర్కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆయన గతంలో ఇదే శాఖ కార్యదర్శిగా పని చేశారు.